కరీంనగర్ జిల్లా సర్కార్ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగినయ్

కరీంనగర్ జిల్లా సర్కార్ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగినయ్
  • నిరుటితో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో 24 శాతం పెరిగిన ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ 
  • అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 39 శాతం పెరుగుదల
  • టీచర్ల కృషి, టెన్త్‌‌లో రిజల్ట్స్ పెరగడమే కారణం

కరీంనగర్, వెలుగు: సర్కార్ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయడం, టెన్త్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు రావడంతో తమ పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల్లో(కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల) 2024–25 అకడమిక్ ఇయర్ లో 18,413 మంది విద్యార్థులు చేరగా.. ఈ విద్యా సంవత్సరం 22,736 మంది కొత్తగా చేరారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుటితో పోలిస్తే ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్ల సంఖ్య 23.5 శాతం పెరగడం విశేషం. 

జగిత్యాల టాప్..  

జగిత్యాల జిల్లాలో నిరుడు 3,690 మంది అడ్మిషన్ పొందగా ఈ సారి 5,147 మంది చేరారు. నిరుటితో పోలిస్తే 39 శాతం ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ పెరిగింది. కరీంనగర్ జిల్లాలో నిరుడు 4,831 మంది అడ్మిషన్ పొందగా ఈ సారి 6,393 మంది చేరారు. నిరుటితో పోలిస్తే 32 శాతం అడ్మిషన్లు పెరిగాయి. పెద్దపల్లి జిల్లాలో నిరుడు 3,612 మంది అడ్మిషన్ పొందగా ఈ సారి 4,295 మంది(19శాతం పెరిగింది) చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుడు 6,280 మంది అడ్మిషన్ పొందగా ఈ సారి 6,901 మంది(10శాతం పెరిగింది) అడ్మిషన్లు తీసుకున్నారు. ఇందులో సగం మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చినవారేనని ఆఫీసర్లు చెబుతున్నారు. 

సర్కార్ విధానాలతో పెరిగిన నమ్మకం.. 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే సర్కార్ బడులపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం పెరగడానికి కారణమని తెలుస్తోంది. హెచ్‌‌ఎంలు, సీఆర్పీలు, టీచర్లు చేపట్టిన ‘బడిబాట’ కార్యక్రమంతోపాటు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు రావడం కూడా అడ్మిషన్లు పెరగడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఏడాది 108 ప్రభుత్వ స్కూళ్లలో వందకుపైగా స్కూళ్లలో నూరు శాతం ఉత్తీర్ణత వచ్చింది.

 రాజన్నసిరిసిల్ల జిల్లాలో 128 స్కూళ్లు, కరీంనగర్ జిల్లాలో 192 స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.  అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించడం, స్కూల్ ప్రారంభమైన రోజే బుక్స్, యూనిఫామ్ విద్యార్థులకు అందజేయడం సత్ఫలితాలిచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో స్కూళ్లు కళకళలాడుతున్నాయి. 

స్టూడెంట్స్ ఎన్ రోల్ మెంట్ ఇలా..

జిల్లా    నిరుడు    ఈ ఏడాది
జగిత్యాల    3,690    5,147
 కరీంనగర్    4,831    6,393
రాజన్నసిరిసిల్ల    6,280    6,901