కరోనా.. లాక్డౌన్.. సెకండ్ వేవ్.. ఇప్పుడు థర్డ్ వేవ్ భయం. రెండేండ్ల నుంచి సర్కార్ బళ్లు బంద్. స్టూడెంట్ల పరిస్థితి? పిల్లల్ని పట్టించుకునేటోడే లేడు. కానీ, కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం రంగారావుపల్లికి చెందిన ఓ సారు పిల్లల చదువు ఆగం కావొద్దనుకున్నడు. కొత్త ఆలోచన చేసిండు. ‘ఎడ్యుకేషన్ టు డోర్స్టెప్’ను షురూ జేసిండు.
రంగారావుపల్లికి చెందిన సందెవేని రమాకాంత్ సర్కార్ బడిలో టీచర్. ప్రస్తుతం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాంనగర్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నడు. కరోనా వల్ల దాదాపు రెండేండ్ల నుంచి స్కూళ్లకు పోని పిల్లలకు ఊర్లనే పాఠాలు చెబుతున్నడు. ఇళ్ల గోడలనే బోర్డుగా చేసుకున్నడు. వాటిపై రంగు రంగుల చార్టులు, బొమ్మలు గీసి చదువు నేర్పిస్తున్నడు. ఆ ఊళ్లోని ప్రతి ఇల్లు, ప్రహరీగోడ, స్తంభాన్ని చదువుకునే పుస్తకం లెక్కనే తయారు చేసిండు.
“నాకు పెయింటింగ్స్ వేయడం అలవాటు. దాంతో రూ. 10 వేలు ఖర్చుపెట్టి, సామాగ్రి కొని బొమ్మలు, అక్షరాలు, చార్టులు గీసిన. స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘ఎడ్యుకేషన్ టు డోర్స్టెప్’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని షురూ చేసిన. రంగు రంగుల బొమ్మలతో చెప్పడంతో స్టూడెంట్స్ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు” అని సంతోషంగా చెప్పిండు ఈ సారు. ఆయన చేసిన ఈ పనిని డీఈవో జగన్మోహనరెడ్డి మెచ్చుకున్నడు. సారుకు వచ్చిన మంచి ఆలోచన వల్ల పిల్లలు మంచిగ చదువుకుంటున్నరని ఊళ్లోవాళ్లు ఆనంద పడుతున్నరు.
::: బొల్లబత్తిని శ్రీనివాస్, వెలుగు, గంగాధర