‘డబుల్’ ఇండ్లు పరిశీలిస్తుండగా కుంగిన బేస్‌మెంట్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌‌కు తప్పిన ప్రమాదం

‘డబుల్’ ఇండ్లు పరిశీలిస్తుండగా కుంగిన బేస్‌మెంట్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌‌కు తప్పిన ప్రమాదం

వేములవాడ, వెలుగు: -రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్​ డిపో సమీపంలో డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లిన వేములవాడ ఎమ్మెల్యే, విప్​ అది శ్రీనివాస్​, కలెక్టర్​ గరిమా అగ్రవాల్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇండ్ల పనులను పరిశీలిస్తుండగా బేస్​మెంట్​ కుంగిపోవడంతో భద్రతా సిబ్బంది వారిని పట్టుకొని పక్కకు తీసుకొచ్చారు.

 బీఆర్ఎస్​ హయాంలో 2019లో 144 డబుల్​  బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్​ చేశారు. 2020 జులై 26న భారీ వర్షాలకు పిల్లర్  బెడ్స్​ కుంగిపోయాయి. ఆ తరువాత పనులు ప్రారంభించినా, నాసిరకంగా పనులు జరుగుతున్నాయని అప్పట్లో ప్రతిపక్ష నేతలు నిలదీయడం, నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్లీ పనులు మొదలుపెట్టారు. 

ఈ క్రమంలో వాటిని పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్, విప్​తో పాటు ఆఫీసర్లు, కాంగ్రెస్​ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో వెళ్లడంతో బేస్​మెంట్​ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్​ మాట్లాడుతూ బీఆర్ఎస్​ హయాంలో అన్నీ నాసిరకం పనులే జరిగాయని విమర్శించారు.

 నాసిరకం పనులపై గతంలో తాము అందోళనలు చేపట్టామని గుర్తు చేశారు. బేస్​మెంట్​ పరిశీలిస్తుండగానే కూలిపోవడం ఏమిటని ప్రశ్నించారు. వేములవాడ మూలవాగు బ్రిడ్జి కడుతుండగానే మూడు సార్లు కూలిపోయిందని, కాళేశ్వరం పరిస్థితి అలాగే ఉందన్నారు. కమీషన్ల కోసం నాసిరకంగా కట్టడాలు నిర్మించి అక్రమార్జనకు తెర లేపారన్నారు.