- రూ.30 లక్షల కోట్లకు చేరుకున్న ప్యాకేజీ
- దేశ జీడీపీలో 15 శాతంఎకానమీ బూస్టప్ కు సాయం
- ఎంప్లా యిమెంట్ పెరిగేలా చర్యలు
- మార్చి వరకు ఈసీఎల్జీఎస్
న్యూఢిల్లీ: కరోనా బారిన పడ్డ ఇండియన్ ఎకానమీని మళ్లీ పరుగులు పెట్టించేందుకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‘ఆత్మనిర్భర్ భారత్ 3.0’ను ప్రకటించారు. దేశంలో ఎంప్లాయిమెంట్ పెంచేందుకు, రైతులకు సాయం చేసేందుకు, నిలిచిపోయిన హౌసింగ్ యూనిట్ల సేల్ కోసం, ఎమర్జెన్సీ క్రెడిట్ అందించేందుకు, వ్యాక్సిన్ రీసెర్చ్ కోసం నిర్మల ఈ ప్యాకేజీని తీసుకొచ్చారు. మొత్తం రూ.2.65 లక్షల కోట్లతో తీసుకొచ్చిన స్టిమ్యులస్ ప్యాకేజీలో 12 రకాల చర్యలను నిర్మల ప్రకటించారు. దీంతో మొత్తంగా వైరస్ రిలీఫ్ కింద ప్రభుత్వం అందించిన ప్యాకేజీ రూ.30 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది దేశ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్(జీడీపీ)లో 15 శాతంగా ఉంది.
కరోనా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఎకానమీ చాలా స్ట్రాంగ్గా రికవరీ అవుతోందని నిర్మల తెలిపారు. ఎనర్జీ కన్జంప్షన్, జీఎస్టీ కలెక్షన్, డైలీ రైల్వే ఫ్రయిట్, బ్యాంక్ క్రెడిట్లలో ఈ రికవరీ ప్రతిబింబిస్తోందని వివరించారు. ఎకానమీ రికవరీ డేటాను వెల్లడించిన నిర్మల.. కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) అక్టోబర్ నెలలో 58.9 పాయింట్లకు పెరిగిందన్నారు. ఇది అంతకుముందు నెలలో 54.6 పాయింట్లుగా ఉందని తెలిపారు. ఎనర్జీ కన్జంప్షన్ గ్రోత్ అక్టోబర్ నెలలో ఇయర్ ఆన్ ఇయర్ 12 శాతంగా ఉందని చెప్పారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్లు 10 శాతం పెరిగి రూ.1.05 లక్షల కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. బ్యాంక్ క్రెడిట్ 5.1 శాతం పెరిగిందని, ఏప్రిల్–-ఆగస్ట్ కాలంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్ఫ్లోస్(ఎఫ్డీఐ)35.37 బిలియన్ డాలర్లు(13 శాతం గ్రోత్) వచ్చాయని తెలిపారు. అంతేకాక కరోనా యాక్టివ్ కేసులు కూడా దేశంలో 10 లక్షల నుంచి 4.89 లక్షలకు తగ్గాయని చెప్పారు.
రైతులకు ఫెర్టిలైజర్ సబ్సిడీ…
స్టిమ్యులస్ ప్యాకేజీలో భాగంగా రైతులకు రూ.65 వేల కోట్ల ఫెర్టిలైజర్ సబ్సిడీని నిర్మల ప్రకటించారు. ఈ రూ.65 వేల కోట్లను రైతులకు ఎప్పడికప్పుడు ఫెర్టిలైజర్స్ను అందుబాటులో ఉంచేందుకు ఖర్చు చేస్తామని తెలిపారు. వచ్చే పంట సీజన్లో కరెక్ట్ టైమ్కి ఫెర్టిలైజర్స్ను అందించడమే తమ ధ్యేయమన్నారు.
కొత్త ఉద్యోగాల క్రియేషన్..
కొత్తగా ఉద్యోగాలను అందించే సంస్థలకు కేంద్రం జాబ్ క్రియేషన్ స్కీమ్ కింద సబ్సిడీని ప్రకటించింది. ఈ సబ్సిడీ ఎంప్లాయీస్, ఎంప్లాయర్స్ చేసే రిటైర్మెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్స్కు రెండేళ్ల పాటు వర్తించనుంది. ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్(జీతాల్లో 12 శాతం), ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ (12 శాతం)ను కొత్తగా ఏర్పాటు చేసే సంస్థలకు రెండేళ్ల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుంది.రిజిస్టర్ అయిన సంస్థలు కొత్త ఉద్యోగులను తీసుకుంటేనే అందిస్తుంది.
‘ఆత్మనిర్భర్ భారత్ 3.0’లో భాగంగా ప్రకటించిన చర్యలు
రియల్ ఎస్టేట్ సెక్టార్కు ఊతం…
హౌసింగ్ యూనిట్ల అమ్మకంపై ఇటు ఇండ్ల కొనుగోలుదారులకు, అటు రియాల్టీ డెవలపర్లకు ఊరట కల్పించేలా ప్రభుత్వం ట్యాక్స్ రిలీఫ్ చర్యలను ప్రకటించింది. సర్కిల్ రేటుకు, అగ్రిమెంట్ వాల్యుకు మధ్యనున్న తేడాను 10 శాతం నుంచి 20 శాతం పెంచుతున్నట్టు నిర్మల తెలిపారు. రూ.2 కోట్ల వరకు వాల్యు ఉన్న రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకానికి ఇది వర్తిస్తుందని చెప్పారు. 2021 జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని వెల్లడించారు.
అర్బన్ హౌసింగ్ స్కీమ్కు రూ.18 వేల కోట్లు…
రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లను త్వరగా పూర్తి చేసేందుకు అర్బన హౌసింగ్ స్కీమ్కు(పీఎం ఆవాస్ యోజన్–అర్బన్కు) అదనంగా రూ.18 వేల కోట్లను అందించారు. దీని ద్వారా ఉద్యోగాలను క్రియేట్ చేయొచ్చని, ఎకానమీ పుంజుకునేలా చేయొచ్చని నిర్మల అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అర్బన్ హౌసింగ్ స్కీమ్కు ప్రభుత్వం రూ.8 వేల కోట్లపైన అందించింది. కొత్తగా అందించనున్న మొత్తంతో 12 లక్షల ఇండ్ల పనులు ప్రారంభించవచ్చని, 18 లక్షల ఇండ్లను పూర్తి చేయొచ్చని నిర్మల వెల్లడించారు. ఇండ్ల నిర్మాణం మొదలుకావడంతో స్టీల్కి, సిమెంట్కి డిమాండ్ పెంచవచ్చని, 78 లక్షల కొత్త జాబ్స్ను క్రియేట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు.
రూరల్ ఎంప్లాయిమెంట్కు బూస్టప్…
పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.10 వేల కోట్లను అందించనున్నట్టు నిర్మల ప్రకటించారు. ఈ మొత్తం రూరల్ ఎకనమిక్ గ్రోత్కు సాయం చేస్తుందన్నారు. ఇప్పటి వరకు ఎంజీఎన్ఆర్ఈజీఏ కు ప్రభుత్వం రూ.73,504 కోట్లను విడుదల చేసింది. 116 జిల్లాలో పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన అమల్లో ఉంది. రూ.57,543 కోట్లను ఇప్పటి వరకు ఖర్చు చేశారు.
ఎక్స్పోర్ట్ల ప్రమోషన్ కోసం..
ఐడియాస్ స్కీమ్ కింద ఎక్స్పోర్ట్స్ను ప్రమోట్ చేసేందుకు రూ.3 వేల కోట్లను ఎక్సిమ్ బ్యాంక్కి అందించారు. ప్రభుత్వం తరఫున లైన్స్ ఆఫ్ క్రెడిట్స్(ఎల్ఓసీ)ని ఎక్సిమ్ బ్యాంక్ మరింత పెంచనుంది.
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ఈసీఎల్జీఎస్) పెంపు..
ప్రస్తుతమున్న ఈసీఎల్జీఎస్ను 2021 మార్చి 31 వరకు పొడిగించింది. 100 శాతం గ్యారెంటీ కొలాటెరల్ ఫ్రీ రుణాలను ప్రభుత్వం అందిస్తోంది. ప్రస్తుతం ఈసీఎల్జీఎస్ 1.0 కింద రూ.2.05 లక్షల కోట్లను 61 లక్షల మంది బారోవర్స్కు కేటాయించగా.. వాటిలో రూ.1.52 లక్షల కోట్లను అందించింది.
చైనా నుంచి బయటికి వచ్చేస్తోన్న సంస్థలపై ఫోకస్..
ప్రస్తుతమున్న ఐదేళ్ల పీఎల్ఐ స్కీమ్ను మరో పది రంగాలకు విస్తరించింది. దీని కోసం గురువారమే రూ.1.45 లక్షల కోట్లను అందించింది. దేశంలోనే మాన్యుఫాక్చరింగ్ సంస్థలను ఏర్పాటు చేసేలా.. ఆసియాలో ఆల్టర్నేటివ్ గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా ఇండియాను మార్చేలా ఈ స్కీమ్ ఉంది. చైనా నుంచి బయటికి వచ్చేస్తోన్న సంస్థలపై ఈ స్కీమ్ స్పెషల్ ఫోకస్ పెడుతుంది.
కాంట్రాక్టర్లకు రిలీఫ్..
కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సపోర్ట్ ఇచ్చేందుకు.. కాంట్రాక్ట్లపై పర్ఫార్మెన్స్ సెక్యూరిటీని 3 శాతానికి తగ్గించింది ప్రభుత్వం. ఈ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ ప్రస్తుతం నడుస్తోన్న ప్రాజెక్ట్లకు కూడా వర్తిస్తుంది. బిడ్ సెక్యూరిటీ డిక్లరేషన్తో రీప్లేస్ అయ్యే టెండర్లకు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అవసరం ఉండదు.
వ్యాక్సిన్ రీసెర్చ్ కోసం..
కరోనా వ్యాక్సిన్ రీసెర్చ్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి రూ.900 కోట్ల గ్రాంట్ను అందించింది. ఈ గ్రాంట్లో వ్యాక్సిన్ అసలు కాస్ట్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు కవర్ కావు. ఎన్బీఎఫ్సీలకు, హెచ్ఎఫ్సీలకు స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద రూ.7,227 కోట్లను అందించింది. క్యాపిటల్, ఇండస్ట్రియల్ ఖర్చుల కోసం రూ.10,200 కోట్ల అడిషినల్ బడ్జెట్ను ప్రకటించింది. ఈ ఖర్చుల్లో దేశీయ డిఫెన్స్ ఇక్విప్మెంట్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి
ఉన్నాయి.