ఏపీ బిల్డింగులను తెలంగాణకు అప్పగింత

ఏపీ బిల్డింగులను తెలంగాణకు అప్పగింత

హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకోవడం కోసం హైదరాబాద్ లోని  ప్రభుత్వ భవనాలను చెరి సగం కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుండి నడుస్తున్నందున హైదరాబాద్ లోని  ఏపీ భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ భవనాలను వాడుకోనప్పటికీ ఏపీ  ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. ఉపయోగంలో లేకపోవడంతో భవనాలు పాడవుతున్నాయి. దీంతో  హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఇవాళ గవర్నర్ ను కోరింది.

ఏపీ  పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అభ్యర్థించింది. గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుని ఏపీ  ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విజ్ఞప్తిపై గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ కేబినెట్ కోరిన విధంగానే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు గవర్నర్.