సికింద్రాబాద్, వెలుగు : ఇండియన్ ఆర్మీ.. దేశ బలమైన మూల స్తంభాల్లో ఒకటని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇండియాను కాపాడుతూ.. దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నదని తెలిపారు. సికింద్రాబాద్లోని మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో జరిగిన 102వ స్నాతకోత్సవానికి ఆమె చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న అధికారులు.. వారు పొందిన జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.
యుద్ధభూమిలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మిలటరీ కాలేజీ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా సూచించారు. కరోనా టైంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా.. ట్రైనింగ్ సజావుగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులను అభినందించారు. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు పూర్తి చేసిన 36మంది అధికారులకు గవర్నర్ తమిళిసై పట్టాలు ప్రదానం చేశారు. ప్రతిభ కనబర్చి ప్రాజెక్టు పూర్తి చేసిన వారికి ప్రత్యేక అవార్డులు ఇచ్చారు.