- గవర్నర్ కు స్వాగతం పలికిన అడిషనల్ కలెక్టర్, ఇంచార్జ్ వీసీ
నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటికి చేరుకున్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. హైదరాబాదు నుండి నిజామాబాద్ వరకు రైలులో ప్రయాణించిన గవర్నర్ నిజామాబాద్ నుండి రోడ్డు మార్గంలో ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్ కు స్వాగతం పలకాల్సిన జిల్లా కలెక్టర్ ముష్రాఫ్ అలీ, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ డుమ్మొ కొట్టారు. ఇంచార్జ్ వీసీ వెంకటరమణ, అడిషనల్ కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు స్వాగతం పలికారు.
ఇయ్యాల విద్యార్థులతో కలసి బ్రేక్ ఫాస్ట్
బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉదయం 6.30 గంటలకు సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీకి వచ్చి విద్యార్థులతో కలసి మెస్ లో బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్తో పాటు ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో కూడా స్పెషల్ మీటింగ్ నిర్వహిస్తారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆఫీసర్లు టెంపుల్తో పాటు ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తర్వాత బాసర నుంచి బయలుదేరి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి వెళ్తారు. అక్కడి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతారని గవర్నర్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు.
ఇప్పటికే వర్సిటీ విద్యార్థులతో మీటింగ్
ఇటీవల రాజ్ భవన్ లో కేయూ, ఓయూ, తెలంగాణ, మహాత్మాగాంధీ, నిట్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో ఆయా యూనివర్సిటీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బాసర ట్రిపుల్ ఐటీలో గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ సమస్యలు విని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఇటీవల ఫుడ్ పాయిజన్ తో స్టూడెంట్ మృతి చెందడం తనను కలిచి వేసిందని గవర్నర్ అన్నట్లు స్టూడెంట్స్ తెలిపారు. విద్యార్థులందరికీ అండగా ఉంటానని గవర్నర్ హామీ ఇచ్చారు. త్వరలో అన్ని యూనివర్సిటీల్లో పర్యటిస్తానని ప్రకటించిన మూడు రోజులకే గవర్నర్ వర్సిటీ బాటపట్టడం గమనార్హం.
