
న్యూఢిల్లీ : ఫార్మా, వైట్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ వంటి 14 రంగాల కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాల కింద ఈ ఏడాది నవంబర్ వరకు 746 దరఖాస్తులను ఆమోదించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తయారీ సామర్థ్యాలను, ఎగుమతులను పెంపొందించేందుకు 14 రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల వ్యయంతో పీఎల్ఐ స్కీములను ప్రకటించారు. 24 రాష్ట్రాల్లో వివిధ కంపెనీలు తమ ప్లాంట్లు ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ. 95 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని వల్ల రూ. 7.80 లక్షల కోట్ల ఉత్పత్తి సాధ్యమయింది.
ఏకంగా 6.4 లక్షల మందికి ఉపాధి దొరికిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022–-23లో 101 బిలియన్ డాలర్ల విలువైన మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో స్మార్ట్ఫోన్ల విలువ 11.1 బిలియన్ డాలర్లు ఉంది. ఎగుమతుల విలువ 44 బిలియన్ డాలర్లు ఉంది. టెలికాం రంగంలో దిగుమతులు తగ్గాయి. ఫార్మా రంగంలో కూడా ముడిసరుకు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. మనదేశంలోనే పెన్సిలిన్–-జి తో సహా ప్రత్యేకమైన ఇంటర్మీడియట్ పదార్థాలు, బల్క్ డ్రగ్స్ తయారవుతున్నాయి. సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి వైద్య పరికరాల తయారీలో సాంకేతికత బదిలీ జరిగింది.