
యాదాద్రి పవర్ ప్లాంట్పై రేవంత్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో వాడేందుకు కేసీఆర్ సర్కార్ అనుమతిచ్చిందని, అదంతా కూడా ఇండియా బుల్స్ను బతికించేందుకేనని ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. 2016 ఫిబ్రవరి 1న ఆ సబ్క్రిటికల్ టెక్నాలజీ కొనుగోలుకు నాటి విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. కాలుష్యం, నిర్మాణ ఖర్చులు ఎక్కువయ్యే కాలం చెల్లిన టెక్నాలజీని భద్రాద్రి థర్మల్ ప్లాంట్కు వాడారన్నారు. దీని వల్ల ప్రజలపై ₹7,500 కోట్ల భారం పడిందన్నారు. ప్లాంట్ను 2017 నాటికే పూర్తి చేస్తామని చెప్పారని, రెండేళ్లు దాటినా ఒక్క యూనిట్ కరెంట్ కూడా తయారు చేయలేదని మండిపడ్డారు.
యాదాద్రి థర్మల్ ప్లాంట్కు ₹32 వేల కోట్ల పనులకు నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు కాంట్రాక్ట్ ఇప్పించి, ఆ కంపెనీ నుంచి కేసీఆర్ తన బంధువులకు పనులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. దానికి కేసీఆర్కు భారీగా కమీషన్లు ఇచ్చారని, అందుకు జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు సంతకాలు చేశారని ఆరపించారు. నామినేషన్ పద్ధతిలో పనులు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ₹6 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. సీనియర్ ఐఏఎస్లను నియమించాల్సిన జెన్కో, ట్రాన్స్కో సీఎండీ పోస్టులో రిటైర్ అయిన ప్రభాకర్రావును ఎందుకు నియమించారని రేవంత్ ప్రశ్నించారు. కరెంట్ కొనుగోళ్లలో అవకతవకలను ఆధారాలతో సహా ఈరోజు బయటపెడతామన్నారు.
కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తామని, దర్యాప్తు చేయించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గల్లీల్లో ఫైటింగ్, ఢిల్లీలో దోస్తానా చేస్తూ బీజేపీ, టీఆర్ఎస్లు రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయన్నారు. కరెంట్ కొనుగోళ్లలో ₹1000 కోట్ల అవినీతి జరిగినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ ఆరోపించారని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఆరోపణలు తప్పైతే ఏ శిక్షకైనా రెడీ అన్నారు. కేసీఆర్ చేసిన సహారా ఇండియా కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణాలపై మర్రి శశిధర్రెడ్డి, సాగునీటి అవినీతిపై ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, కరెంట్, భూకుంభకోణాలను బయటపెట్టేందుకు తనతో పార్టీ కమిటీ వేసిందని ఆయన తెలిపారు.