- కరోనా లక్షణాల్లో చేర్చడంపై కేంద్ర సర్కార్ యోచన
- ఆ సింప్టమ్స్ కనిపించినా టెస్టులు చేయడంపై చర్చ
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా కరోనా లక్షణాలంటే దగ్గు, జ్వరం, జలుబు..! ఇంకా చెప్పుకోవాలంటే కడుపునొప్పి, విరేచనాలు..! వాటికి తోడుగా రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం వంటివి చేరాయి. చాలా స్టడీల్లో కరోనా పేషెంట్లకు ఆ లక్షణాలూ ఉన్నాయని తేలింది. అయితే, అధికారికంగా మాత్రం మన దగ్గర వాటిని లక్షణాల్లో చేర్చలేదు కేంద్ర సర్కారు. ఇప్పుడు వాటినీ కరోనా లక్షణాల్లో చేర్చేందుకు కసరత్తులు చేస్తోంది. దేశంలో టెస్టులు చేసేందుకు ఆ లక్షణాలనూ లెక్కలోకి తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై గత ఆదివారం జరిగిన కొవిడ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో చర్చ కూడా జరిగిందని అంటున్నాయి. ‘‘ఆ మీటింగ్లో కరోనా లక్షణాల్లో ఆ రెండింటినీ చేర్చడంపై చర్చ జరిగింది. చాలా మంది పేషెంట్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నందున.. ఆ లక్షణాలున్నవారికీ టెస్టులు చేయాలని కొందరు సభ్యులు సూచించారు. అయితే, దీనిపై ఇంకా ఓ అభిప్రాయానికి రాలేదు’’ అని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే వీటిని అమెరికా నేషనల్ పబ్లిక్ హెల్త్ ఇనిస్టిట్యూట్ అయిన సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ కరోనా లక్షణాల్లో చేర్చింది.
టెస్టులపై ఇవీ ఐసీఎంఆర్ గైడ్లైన్స్
- విదేశాల నుంచి వచ్చినోళ్లు, వలసకూలీలకు ఇన్ఫ్లుయెంజా (జలుబు, దగ్గు, జ్వరం వంటివి) లక్షణాలుంటే వారంలోపు టెస్టులు చేయాలి.
- ఇన్ఫ్లుయెంజా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాలి.
- కరోనా డ్యూటీలో ఉన్న హెల్త్వర్కర్లు, కంటెయిన్మెంట్ జోన్లలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయాలి.
- పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కాంటాక్ట్ అయి, లక్షణాలు కనిపించని హైరిస్క్ వ్యక్తులకు.. కరోనా రోగిని కలిసిన 5 నుంచి 10 రోజుల్లో టెస్టులు చేయాలి.
- హాట్స్పాట్లు, కంటెయిన్మెంట్జోన్లలో ఉంటున్న ఇన్ఫ్లుయెంజా పేషెంట్లు, శ్వాస సమస్యలతో బాధపడుతున్న వాళ్లకూ టెస్టులు చేయాలి.
మొత్తం నాడీ వ్యవస్థపై కరోనా ఎఫెక్ట్
శరీరంలోని మొత్తం నాడీ వ్యవస్థకు (నర్వస్ సిస్టమ్) కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని తేలింది. అమెరికాలోని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. అమెరికా ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సగం మంది కరోనా రోగులకు తలనొప్పి, ఫిట్స్, స్ట్రోక్, బలహీనత, కండరాల నొప్పులు, నీరసం, కళ్లు తిరగడం, యాక్టివ్గా ఉండకపోవడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి లక్షణాలున్నాయని గుర్తించారు. వాటితో పాటు రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం వంటి లక్షణాలూ ఉన్నట్టు తేల్చారు. చాలా మంది పేషెంట్లలో జ్వరం వంటి లక్షణాలు లేకముందే ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు బయటపడ్డాయని స్టడీకి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఇగోర్ కోరాల్నిక్ చెప్పారు. మెదడు, వెన్ను, నరాలు, కండరాలపై కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని అన్నారు. మొత్తం నాడీ వ్యవస్థకూ అది ముప్పుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.