నల్గొండ జిల్లాలో పల్లె పోరుకు సిద్ధం .. రెడీగా బ్యాలెట్ పేపర్లు.. బాక్సులు

నల్గొండ జిల్లాలో పల్లె పోరుకు సిద్ధం .. రెడీగా బ్యాలెట్ పేపర్లు.. బాక్సులు
  • పోలింగ్​స్టేషన్లను గుర్తించిన ఆఫీసర్లు
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,781 పంచాయతీలు
  • 23.03 లక్షల మంది ఓటర్లు
  • రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ

యాదాద్రి, నల్గొండ, వెలుగు: హైకోర్టు తీర్పుతో గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వచ్చింది. తీర్పు ప్రకారం వచ్చే 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన క్యాబినెట్​మీటింగ్​లో వెల్లడించింది. 

16 నెలలుగా స్పెషల్​ఆఫీసర్ల పాలన

గ్రామాల్లో సర్పంచ్​ల పాలన గతేడాది ఫిబ్రవరి 1న ముగిసిపోయింది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారని భావించినా వివిధ కారణాల వల్ల కుదరలేదు. దీంతో 16 నెలలుగా పంచాయతీల్లో స్పెషల్​ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలోనే ఎన్నికలుంటాయని ప్రచారం జరగడంతో రాజకీయ పార్టీల ప్రతినిధుల వరుస మీటింగ్​లు జరిగాయి. 

ఆఫీసర్లు రెడీగా ఉన్నప్పటికీ సాధ్యం కాలేదు. ఇటీవల మున్సిపాలిటీల్లో వార్డుల డీలిమిటేషన్​నోటిఫికేషన్​రిలీజ్​అవడం, అభ్యంతరాలు స్వీకరించడం జరిగిపోయాయి. దీనికితోడు కొన్ని రోజులుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ  ఎన్నికలు ముందు జరుగుతాయంటూ ప్రచారం జరిగింది. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 

బీసీ కోటాలో ఏ పంచాయతీలో?

అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 23 నుంచి 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్​హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకొని, అసెంబ్లీలో రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించారు. ఫలితంగా రిజర్వేషన్ల మార్పు, బీసీ కోటా పెంపు అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏ పంచాయతీలు బీసీ కోటాలో చేరుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

 రిజర్వేషన్లు పెరిగితే.. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త వాటితో కలిపి 1,781 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 23,03, 283 మంది ఓటర్లు ఉన్నారు. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ.. అమలు సాధ్యమైనా అన్న చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే 748 పంచాయతీలు వారి చేతుల్లోకి వెళ్తాయి. ఉమ్మడి జిల్లాలో 15,574 వార్డులున్నాయి. వీటిలో రిజర్వేషన్లు అమలు చేస్తే 6,541 వార్డులు బీసీలకు వెళ్తాయి. 

నల్గొండలో 868 గ్రామాలు

పంచాయితీ ఎన్నికలు గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లాలో 844 గ్రామాలు ఉండగా కొత్తగా 24 పెరిగాయి. దీంతో ఆ సంఖ్య 868కి చేరింది. 7,482 వార్డులు, పోలింగ్​కేంద్రాలున్నాయి. 22.50  లక్షల బ్యాలెట్ పేపర్లు ప్రింట్​ చేశారు. 5,876 బ్యాలెట్​ బాక్సులు ఉన్నాయి. 

సూర్యాపేటలో 486 గ్రామాలు

సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా 11 పంచాయతీలు పెరిగాయి. దీంతో ఆ సంఖ్య 486కు చేరింది. 4,388 వార్డులున్నాయి. 4,403 పోలింగ్​ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 14 లక్షల బ్యాలెట్ పేపర్లు ప్రింట్​చేశారు. 

మహిళా ఓటర్లే ఎక్కువ

జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను ఆఫీసర్లు విడుదల చేశారు. మూడు జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 

యాదాద్రి జిల్లాలో 427 గ్రామాలు

యాదాద్రి జిల్లాలో గతంలో 421 పంచాయతీలు ఉండగా ఒకటి తగ్గి, ఏడు పెరిగాయి. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య 427కు చేరింది. 3,704 వార్డులు ఉన్నాయి.  భూదాన్​ పోచంపల్లి మండలంలోని సాయినగర్​ పంచాయతీని ఇటీవలే పెద్ద అంబర్​పేట మున్సిపాలిటీలో కలిపారు.  అవసరమైన 13 లక్షల బ్యాలెట్ పేపర్లు ఇప్పటికే ప్రింట్​చేశారు. బ్యాలెట్ బాక్సులు 1,800 ఉండగా.. వీటిలో 150కి పైగా పనికి రాకుండా పోయాయి. అవసరమైన బాక్సులను తెప్పించనున్నారు. 3,719 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. 

జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు

జిల్లా    జీపీలు    పురుషులు    మహిళలు    ఇతరులు        మొత్తం
నల్గొండ    868    5,33,575    5,44,644    55    10,78,274
సూర్యాపేట    486    3,39,857    3,52,633    21         6,92,511
యాదాద్రి    427    2,64,765    2,67,729    04         5,32,498