
- వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఘటన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- మనవడిని అరెస్ట్ చేసిన పోలీసులు
వికారాబాద్, వెలుగు: పెన్షన్ పైసల కోసం నాయనమ్మను ఓ మనవడు కాళ్లతో తన్నిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్లో జరిగింది. రెండ్రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాలిలా ఉన్నాయి.. మంబాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు చింది యశోదమ్మ(70)కు ఆసరా పెన్షన్ వస్తోంది. రెండ్రోజుల కిందట ఆమెకు పెన్షన్రాగా ఆ డబ్బులను ఇవ్వాలంటూ మనవడు గోవర్ధన్ మద్యం మత్తులో ఆమెపై దాడి చేశాడు. కాళ్లతో తన్నుతూ హింసించాడు. తర్వాత కట్టెతో కొట్టాడు. రూ.2 వేలను బలవంతంగా లాక్కుని వెళ్లిపోయాడు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వికారాబాద్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆదేశాలతో ఎస్ఐ అబ్దుల్రవూఫ్ శుక్రవారం ఉదయం పరారీలో ఉన్న గోవర్ధన్ను అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిసైన గోవర్ధన్ వైఖరి కారణంగా అతడిని భార్య వదిలేసి వెళ్లినట్లు గ్రామస్థులు చెప్తున్నారు.