
- ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్లు అవసరమంటున్న ఆఫీసర్లు
- కన్సల్టెన్సీ సర్వీసులు ఇచ్చే సంస్థల కోసం టెండర్ల ఆహ్వానం
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థను విస్తరించేందుకు వాటర్బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు వరకూ సేవలందిస్తున్న బోర్డు.. రానున్న రోజుల్లో ట్రిపుల్ఆర్వరకూ విస్తరించబోతోంది. దీనికి తగ్గట్టు మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు తీసుకుంటోంది. తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, కొత్త ప్రాజెక్టులను చేపట్టడం వంటి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటి నిధుల కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆశలు పెట్టుకున్నది.
అర్బన్ చాలెంజ్ ఫండ్ కోసం..
అమృత్ మహోత్సవ్ స్కీంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అర్బన్ ఏరియాల అభివృద్ధికి నిధులను విడుదల చేయడానికి ‘అర్బన్చాలెంజ్ఫండ్’ ఏర్పాటు చేసింది. ఈ స్కీం కింద ఈ ఏడాది దాదాపు రూ.లక్ష కోట్లను దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నగరాలకు అందజేస్తోంది. గ్రేటర్ పరిధిలో కూడా తాగునీటి వ్యవస్థ ఇంప్రూవ్ చేయడం, విస్తరించడం, ఎస్టీపీలను నిర్మించడం వంటి పనుల కోసం రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. ఈ నిధులు కావాలంటే ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి డీపీఆర్లను కేంద్రానికి అందజేయాల్సి ఉంటుంది.
దీంతో వాటర్బోర్డు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్లు, ఎస్టిమేషన్లు, డాక్యుంమెంటేషన్, ప్రిపరేషన్ఆఫ్ప్రపోజల్స్, సర్వేల నిర్వహణకు కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ఇంట్రస్ట్ అఫ్ ఎక్స్ ప్రెషన్’ పేరుతో వివివిధ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లు దక్కించుకున్న సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టడానికి పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి అర్హులైన వారిని నియమించుకుంటామని అధికారులు తెలిపారు.