- తాజాగా రూ.1,650 కోట్లు సేకరించిన స్టార్టప్
- ఐపీఓకి వచ్చే ప్లాన్.. మరి కొన్ని క్వార్టర్లలో ప్రాఫిట్లోకి వస్తామని వెల్లడి
- గ్రోసరీ డెలివరీపైనే ఫుల్ ఫోకస్
బిజినెస్ డెస్క్, వెలుగు: గ్రోసరీ డెలివరీ స్టార్టప్ జెప్టో యూనికార్న్గా మారింది. ఫండ్స్ సేకరించడానికి స్టార్టప్ కంపెనీలు ఇబ్బంది పడుతున్న వేళ సిరీస్ ఈ రౌండ్లో రూ.1,650 కోట్లు (200 మిలియన్ డాలర్లు) సేకరించి ఈ ఏడాది యూనికార్న్గా మారిన మొదటి స్టార్టప్గా నిలిచింది. 1.4 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దగ్గర ఈ ఫండ్స్ సేకరించింది. కాగా, బిలియన్ డాలర్ల (రూ.8,200 కోట్ల) కంటే ఎక్కువ వాల్యూ ఉన్న స్టార్టప్లను యూనికార్న్లుగా పిలుస్తారు. ఇండియాలో చివరిసారిగా సెప్టెంబర్, 2022 లో మొల్బియో డయాగ్నస్టిక్స్ యూనికార్న్గా మారింది. తాజా ఫండింగ్ రౌండ్లో యూఎస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టెప్స్టోన్ గ్రూప్, గుడ్వాటర్ క్యాపిటల్, ఇప్పటికే షేర్హోల్డర్లుగా ఉన్న కొంత మంది పాల్గొన్నారు. జెప్టో వాల్యుయేషన్ కిందటేడాది మేలో 900 మిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. 2021 లో స్టార్టప్ కంపెనీలు భారీగా ఫండ్స్ సేకరించగలిగాయి. ఆ టైమ్లో వారానికి ఒకటి చొప్పున యూనికార్న్లు పుట్టుకొచ్చాయి.
2021 లో ఏకంగా 44 యూనికార్న్లు క్రియేట్ అవ్వగా, 2022 లో 23 యూనికార్న్లు వచ్చాయి. గత ఏడాది కాలంగా మాత్రం ఫండ్స్ సేకరించడంలో స్టార్టప్లు బాగా ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా జెప్టో సేకరించిన 200 మిలియన్ డాలర్లలో 75 మిలియన్ డాలర్లు స్టెప్స్టోన్ గ్రూప్ ఇన్వెస్ట్ చేయగా, 30 మిలియన్ డాలర్లు గుడ్వాటర్ క్యాపిటల్ అందించింది. స్టెప్స్టోన్కు ఇండియాలో ఇదే మొదటి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. గుడ్వాటర్ క్యాపిటల్ ఇప్పటికే ఆడియో స్ట్రీమింగ్ స్టార్టప్ పాకెట్ ఎఫ్ఎం, ఎడ్టెక్ కంపెనీ టెక్మింట్, యెల్లోక్లాస్లలో పెట్టుబడులు పెట్టింది. మిగిలిన 95 మిలియన్ డాలర్లను ఇప్పటికే షేర్హోల్డర్లుగా ఉన్న నెక్సస్ వెంచర్స్ పార్టనర్స్ , గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్, లాచీ గ్రూమ్ అందించాయి. తాజాగా తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారు హై క్వాలిటీ ఇన్వెస్టర్లని, పరిస్థితులు బాగోలేని టైమ్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి వెనకడుగు వేయలేదని జెప్టో ఫౌండర్ అదిత్ పలిచా అన్నారు. జొమాటోకి చెందిన బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, రిలయన్స్కు చెందిన డంజో, టాటా కంపెనీ బిగ్బాస్కెట్లతో జెప్టో పోటీ పడుతోంది. ఆర్డర్ వాల్యూమ్స్ ప్రకారం బ్లింకిట్, ఇన్స్టామార్ట్ టాప్లో ఉండగా, జెప్టో థర్డ్ ప్లేస్లో ఉంది. కంపెనీ ఖర్చులు ఈ ఏడాది ఏప్రిల్లో రూ.55 కోట్లకు తగ్గాయి. కిందటేడాది సెప్టెంబర్లో రూ.90 కోట్లుగా రికార్డయ్యాయి. ఖర్చులు తగ్గుతున్నాయని పలిచా వెల్లడించారు. రానున్న క్వార్టర్లలో ఏడాదికి రూ.8,200 కోట్ల విలువైన అమ్మకాలు జరుపుతామని చెప్పారు.
2025 లో ఐపీఓ..
జెప్టో 2025 ప్రారంభంలో ఐపీఓకి వస్తుందని అదిత్ పలిచా వెల్లడించారు. ఇబిటా (ట్యాక్స్ల కంటే ముందు ప్రాఫిట్) పాజిటివ్గా మారిన తర్వాత ఒకసారి ఫండింగ్ రౌండ్ చేపడతామని, ఆ తర్వాత ఐపీఓకి వస్తామని అన్నారు. ఐపీఓ టైమ్ కల్లా ప్రాఫిటబుల్ కంపెనీగా మారతామని, పబ్లిక్ లిస్టింగ్ సక్సెస్ఫుల్గా చేపడతామని పేర్కొన్నారు. యావరేజ్ ఆర్డర్ వాల్యూ రూ.400–450 దగ్గర ఉందని, రోజుకి 10,000 కస్టమర్లు కొత్తగా యాడ్ అవుతున్నారని అన్నారు. ‘బ్యూటీ, ఫార్మా, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ అన్ని కలిపినా గ్రోసరీ సెగ్మెంటే పెద్దది. దీనిపైనే ఫోకస్ పెడతాం’ అని అన్నారు.
జెప్టో ఇలా మొదలై..
అదిత్ పలిచా, కైవల్య వోహ్రా ఈ క్విక్కామర్స్ స్టార్టప్ను 2021 లో స్టార్ట్ చేశారు. కరోనా సంక్షోభం టైమ్లో మొదలైన ఈ కంపెనీ కేవలం రెండున్నరేళ్లలోనే యూనికార్న్గా మారింది. ఐఐఎఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్లిస్ట్ 2022లో చోటు సంపాదించిన వారిలో యంగెస్ట్గా కైవల్య వోహ్రా రికార్డ్ క్రియేట్ చేశారు కూడా. అప్పటికి ఆయన వయుసు 20 ఏళ్లే. గ్రోసరీస్ 45 నిమిషాల్లోనే డెలివరీ చేసేందుకు కిరాణాకార్ట్ పేరుతో ఓ ప్లాట్ఫామ్ను వోహ్రా మొదట స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ కేవలం ముంబైలోనే కార్యకలాపాలు కొనసాగించింది. ఆ తర్వాత అదిత్ పలిచాతో కలిసి కిరాణాకార్ట్ను జెప్టో కింద విస్తరించారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి అన్ని మెట్రో సిటీలలో ఈ కంపెనీ సేవలందిస్తోంది. కైవల్య వోహ్రా సంపద ఈ ఏడాది జూన్ నాటికి రూ.వెయ్యి కోట్లుగా ఉంది. అదిత్ పలిచా సంపద రూ.1,200 కోట్లు.