- ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పరీక్ష
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామని వివరించారు. పరీక్ష నిర్వహణపై చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్లతో శనివారం జనార్దన్ రెడ్డి ఆన్లైన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్, పోస్టల్ శాఖల అధికారులతో కూడా పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. గ్రూప్ – 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. 3,80,081 మంది అప్లయ్ చేసుకోగా, 3,00,836 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. నిరుడు అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్కు 2,86,051 మంది అటెండ్ అయ్యారని గుర్తు చేశారు. ఆ పరీక్ష రద్దు కావడంతో మళ్లీ ఆదివారం నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 994 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, 310 మంది రూట్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. ప్రతి సెంటర్ వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షకు హాజరయ్యే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెంటర్లోపలికి అనుమతించాలని సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్ హాల్ టికెట్తో పాటు ఏదైనా ఐడెంటిటీ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. అభ్యర్థులు తమ వెంట సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లు తెచ్చుకోవద్దన్నారు. అభ్యర్థులు షూస్, బెల్టులు ధరించొద్దని, చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని సూచించారు. పరీక్షల తీరును పర్యవేక్షించడానికి టీఎస్పీఎస్సీలో కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు.