- ఆన్లైన్లో మాటు వేసిన సైబర్ నేరగాళ్లు
- గూగుల్లో బ్యాంక్కు సంబంధించిన నంబర్లు, ఇతర వివరాలు సర్చ్ చేస్తే చాలు..
- ఆ వెంటనే కాల్ చేసి కాజేస్తున్నరు
- కామారెడ్డి జిల్లాలో రోజుకో సైబర్ క్రైమ్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన ఓ యువకుడికి కొందరు ఫోన్ చేశారు. క్రెడిట్ కార్డు సీవీవీ నంబర్ మార్చాల్సి ఉందని.. ఇందుకుగాను ఓటీపీ నంబర్లు పంపిస్తామని.. వివరాలు చెప్పాలన్నారు. నిజమేనని నమ్మిన అతడు వివరాలతో పాటు, ఓటీపీ నంబర్లు చెప్పగా.. బ్యాంక్ అకౌంట్లో నుంచి రూ.2,48,498 కొల్లగొట్టారు. చివరకు మోసపోయానని గ్రహించి అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ ఫేస్బుక్లో లోన్ యాప్ చూసింది. కొద్ది సేపటికే మహిళకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి లోన్ ఇస్తామని.. ఇందుకు ప్రాసెసింగ్ఫీజు, జీఎస్టీ, ఇతర ఫీజుల పేరిట రూ. 40 వేల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత నుంచి సదరు వ్యక్తుల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి ఆమె పీఎస్ వెళ్లింది.. కామారెడ్డి జిల్లాలో ఇటీవల సైబర్ నేరాలు పెరిగాయి. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి, క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి సందేహాలు తీర్చుకునేందుకు కస్టమర్కేర్ నంబర్లు వెతికితే చాలు.. సైబర్ నేరగాళ్ల ఊచ్చులో పడాల్సి వస్తోంది.
సర్చ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు అడుగుతున్నారు. నిజంగా బ్యాంక్ నుంచే ఫోన్ వచ్చిందని భావించి కొందరు వ్యక్తులు అవతలి వ్యక్తులకు కంప్లీట్గా వివరాలు చెబుతున్నారు. చెప్పిన క్షణాల్లోనే నేరగాల్లో బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. మోస పోయిన వారు ఒకటి, రెండ్రోజుల తర్వాత బ్యాంక్ అకౌంట్లో నుంచి పైసలు పోయిన విషయాన్ని తెలుసుకుని లబోదిబోమంటూ పీఎస్లకు వెళ్తున్నారు. ఇటీవల జిల్లాలో పదుల సంఖ్యలో సైబర్ నేరాలు వెలుగు చూశాయి. కామారెడ్డి టౌన్, దేవునిపల్లి, భిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, పిట్లం, బీర్కుర్, బాన్సువాడ , ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో సైబర్ క్రైమ్లకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. కామారెడ్డి టౌన్, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వారం రోజుల వ్యవధిలో 10కి పైగా ఫిర్యాదులు వచ్చాయంటే సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో గ్రహించవచ్చు. ఒక్కో అకౌంట్లో నుంచి రూ.10 వేల నుంచి రూ.2.50 లక్షలకుపైగా డబ్బులు మాయమయ్యాయి.
ఆవేర్నెస్ చేస్తున్నా...
సైబర్నేరాలపై అలర్ట్గా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్పై జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసు శాఖ ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ రోజుకో ఘటన జిల్లాలో జరుగుతునే ఉంది. గ్రామాలు, టౌన్లో మీటింగ్లు జరిగినప్పుడు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చదువుకున్న వారితో పాటు, చదువురాని వ్యక్తులు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు.