న్యూఢిల్లీ : ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ. 1.59 లక్షల కోట్లకు చేరినట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఆగస్టు నెలలో ఈ జీఎస్టీ వసూళ్లు రూ. 1.43 లక్షల కోట్లు. జులై నెలలో కూడా ఏడాది ప్రాతిపదికన జీఎస్టీ కలెక్షన్స్ ఇంచుమించు ఇదే గ్రోత్ రేటుతో రూ. 1.65 లక్షల కోట్లకు చేరిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఆగస్టులో .4,393 కోట్లు వసూళ్లయ్యాయి.
కిందటేడాది ఆగస్టులో వచ్చిన రూ.3,871 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. జీఎస్టీ ఆగస్టు నెల వసూళ్లలో సీజీఎస్టీ రూ. 28,328 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 35,794 కోట్లు, ఐజీఎస్టీ రూ. 83,251 కోట్లు, సెస్ రూ. 11,695 ఉన్నట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్లో తెలిపింది. సీజీఎస్టీ నుంచి రూ. 37,581 కోట్లు, ఐజీఎస్టీ నుంచి రూ. 31,408 కోట్లను ఎస్జీఎస్టీకి బదలాయించినట్లు పేర్కొంది. దీంతో ఆగస్టు నెలలో రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత సీజీఎస్టీ వసూళ్లు రూ. 65,909 కోట్లు, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ. 67,202 కోట్లుగా నిలిచినట్లు వివరించింది.
ఆగస్టు నెలలో దిగుమతుల ద్వారా వచ్చిన రెవెన్యూ 3 శాతం ఎక్కువగా, డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ల నుంచి వచ్చిన రెవెన్యూ 14 శాతం ఎక్కువగా ఉన్నట్టు డేటా ద్వారా తెలుస్తోంది. పండగల సీజన్ మొదలవడంతో రాబోయే నెలల్లో జీఎస్టీ వసూళ్లు మరింత ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇండ్లు, కార్లు, వెకేషన్స్, ఇతర కన్జూమర్ వస్తువుల కొనుగోళ్ల జోరు పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
మేరా బిల్ మేరా అధికార్ కోసం రూ. 30 కోట్లు....
మేరా బిల్ మేరా అధికార్ స్కీము కింద రివార్డుల కోసం రూ. 30 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కకి పెట్టాయి. ఆరు రాష్ట్రాలలో అమలులోకి తెచ్చిన ఈ స్కీము మొబైల్ యాప్ను ఇప్పటికే 50 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు హర్యానా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దుష్యంత్ చౌతాలా చెప్పారు.