
- 10.4 శాతం వృద్ధి..జీఎస్టీ అమలయ్యాక రెండో హయ్యెస్ట్
- ఏప్రిల్ - జనవరి మధ్య రూ. 16.69 లక్షల కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: జనవరి నెలకు గాను రూ.1,72,129 కోట్ల జీఎస్టీ వసూళ్లయ్యింది. ఇది కిందటేడాది జనవరిలో వచ్చిన గ్రాస్ జీఎస్టీ రూ.1,55,922 లక్షల కోట్ల కంటే 10.4 శాతం ఎక్కువ. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత జనవరి వసూళ్లు రెండో హయ్యెస్ట్ కావడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.70 లక్షల కోట్ల మార్క్ను దాటడం ఇది మూడోసారి.
జనవరి కలెక్షన్స్లోని ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) వసూళ్లలో రూ.43,552 కోట్లు సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) కింద, రూ.37,257 కోట్లు స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) కింద కేంద్రం సెటిల్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్ – జనవరి మధ్య స్థూలంగా రూ.16.69 లక్షల కోట్లు జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్లో వచ్చిన రూ. 14.96 లక్షల కోట్లతో పోలిస్తే 11.6 శాతం గ్రోత్ నమోదు చేసింది.
జనవరి, 2024 ( బుధవారం సాయంత్రం 5 నాటికి) గాను రూ.1,72,129 కోట్ల గ్రాస్ జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. కిందటేడాది జనవరి (31.01.2023 సాయంత్రం 5 నాటికి) లో వచ్చిన రూ.1,55,922 కోట్లతో పోలిస్తే 10.4 శాతం వృద్ధి చెందింది’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.