రికార్డు స్థాయిలో జీఎస్టీ క‌లెక్ష‌న్స్: నిరుటి కంటే 33 శాతం ఎక్కువ‌

రికార్డు స్థాయిలో జీఎస్టీ క‌లెక్ష‌న్స్: నిరుటి కంటే 33 శాతం ఎక్కువ‌

న్యూఢిల్లీ: జులై నెల‌లో గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రికార్డు స్థాయిలో వ‌సూలైంది. గ‌త ఏడాది జులైలో వ‌సూలైన ట్యాక్స్ కంటే 33 శాతం ఎక్కువ‌గా ఈ సారి రూ.1.16 ల‌క్ష‌ల కోట్లు ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేరింది. ఈ ఏడాది జులైలో రూ.1,16,393 కోట్ల జీఎస్టీ వ‌సూలైంద‌ని కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం నాడు వెల్ల‌డించింది. ఆ మొత్తంలో రూ.22,197 కోట్లు సెంట్ర‌ల్ జీఎస్టీ అని, రూ.28,541 కోట్లు స్టేట్ జీఎస్టీ అని తెలిపింది. ఇక రూ.57,894 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ అని, అందులో ఇంపోర్టెడ్ గూడ్స్ మీద వ‌చ్చిన జీఎస్టీనే రూ.27,900 కోట్లు అని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది. టోట‌ల్ జీఎస్టీ క‌లెక్ష‌న్‌లో రూ.7,790 కోట్లు సెస్ రూపంలో వ‌చ్చింద‌ని, ఇందులోనూ రూ.815 కోట్లు ఇంపోర్ట్స్ మీద వ‌సూలు చేసిందేన‌ని తెలిపింది. 

గ‌త ఏడాది జులైలో రూ.87,422 కోట్ల జీఎస్టీ మాత్ర‌మే వ‌సూలు అయింది. 2020లో క‌రోనా కార‌ణంగా క‌ఠినమైన ఆంక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో ఎక‌న‌మిక్ యాక్టివిటీ పెద్ద‌గా లేక‌పోవ‌డం వ‌ల్ల జీఎస్టీ చాలా త‌క్కువ‌గా వ‌చ్చింది. అయితే ఈ ఏడాది కూడా సెకండ్ వేవ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ రెండు నెల‌లుగా ఆంక్ష‌ల స‌డ‌లింపులతో ఎక‌న‌మిక్ యాక్టివిటీ బాగా పెరిగింది. దీంతో ఈ ఏడాది జూన్‌లో రూ.92,849 కోట్ల జీఎస్టీ వ‌సూలు కాగా, ఈ నెల‌లో ల‌క్ష కోట్లు దాటింది.