మొలాసిస్పైనా తగ్గింపు
మిల్లెట్స్, చెరకు రైతులకు ఊతం
కార్పొరేట్ గ్యారంటీపై డైరెక్టర్లకు మినహాయింపు
జరీపై జీఎస్టీ తగ్గింపు
52 వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం
న్యూఢిల్లీ: మిల్లెట్స్ ప్రొడక్టులపై జీఎస్టీని ఇప్పుడున్న 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఫలితంగా మిల్లెట్స్ (చిరు ధాన్యాల) వినియోగం ఊపందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని చెరకు రైతులకు ఊరట కలిగేలా మరోవైపు మొలాసిస్పై వేస్తున్న 28 శాతం జీఎస్టీని 5 శాతంగా మార్చారు. ప్యాకేజ్డ్ లేదా ప్రీ ప్యాకేజ్డ్ పిండిలో 70 శాతం దాకా చిరు ధాన్యాల శాతం ఉంటే 5 శాతమే జీఎస్టీ వర్తిస్తుందని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. జీఎస్టీ కౌన్సిల్52 వ మీటింగ్ శనివారం న్యూఢిల్లీలో జరిగింది. అంతేకాదు ఇంకొక గుడ్న్యూస్ కూడా కౌన్సిల్ ప్రకటించింది.
లూజ్గా అమ్మే మిల్లెట్స్ ఫ్లోర్ను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. పౌష్టిక ఆహారంగా పేరొందిన మిల్లెట్స్ ఇటీవలి కాలంలో ప్రాచుర్యం సంపాదించుకున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఆరోగ్యంపై దేశ ప్రజలలో అవగాహన, ఆసక్తి పెరగడమే దీనికి కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రజలకు పౌష్టిక విలువలు ఎక్కువగా ఉండే మిల్లెట్స్ ప్రొడక్టులు మరింత విరివిగా చేరువ కావాలనే ఉద్దేశంతోనే జీఎస్టీని భారీగా తగ్గించాలని నిర్ణయించారు.
2023 ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో దేశంలో మిల్లెట్స్ ఉత్పత్తి, వినియోగం రెండూ బాగా పెరుగుతాయని కేపీఎంజీ నేషనల్ హెడ్ (ఇండైరెక్ట్ ట్యాక్స్) అభిషేక్ జైన్ వెల్లడించారు.
ఈఎన్ఏపై 18 శాతం జీఎస్టీ....
ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ) పై 18 శాతం జీఎస్టీ విధింపు కోసం ఒక సవరణను సైతం జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. కానీ, మనుషులు వాడే డిస్టిల్డ్ ఆల్కహాల్పై జీఎస్టీ విధించరాదని (మినహాయింపు) ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నాయకత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇండస్ట్రియల్ అవసరాల కు వాడే ఈఎన్ఏపై జీఎస్టీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఈఎన్ఏపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, దానిపై పన్ను విధించే అధికారం జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉందని ఇటీవల అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు మీడియాకు నిర్మలా సీతారామన్ వివరించారు. అయితే, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలి పెట్టాలని కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయించినట్లు ఫైనాన్స్ మినిస్టర్ వెల్లడించారు.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలే పన్ను విధించాలనుకుంటే తాము దానిని స్వాగతించనున్నట్లు పేర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినా, దానిని పక్కకి పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకే పన్ను విధింపు అధికారం ఇవ్వడం కో–ఆపరేటివ్ ఫెడరలిజంకు స్ఫూర్తిని ఇస్తుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ మణి చెప్పారు. ఆల్కహాల్పై పన్ను విధింపును రాష్ట్రాలకు అప్పచెప్పడంతో పాటు, మొలాసిస్పై రేట్లను రేషనలైజ్ చేయడం శుభపరిణామమని ఆల్కహాల్ ఇండస్ట్రీ సంతోషం వ్యక్తం చేస్తోంది.
రైల్వే సర్వీసులపై ఫార్వార్డ్ ఛార్జ్ మెకానిజమ్..
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందేందుకు వీలుగా రైల్వేలు ఇచ్చే సర్వీసులు, సప్లయ్చేసే గూడ్స్(వస్తువుల)పై ఫార్వార్డ్ చార్జ్ మెకానిజమ్ అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జరీపై 5 శాతం..మెటలైజ్డ్ పాలియెస్టర్ ఫిల్మ్ లేదా ప్లాస్టిక్ ఫిల్మ్ నుంచి తయారు చేసే జరీ దారం (థ్రెడ్)పై జీఎస్టీని కూడా 5 శాతానికి తగ్గించారు. బార్లీని మాల్ట్గా మార్చే జాబ్ వర్క్పైనా జీఎస్టీని 18 శాతం నుంచి అయిదు శాతంగా మార్చారు.
కంపెనీ డైరెక్టర్ల కార్పొరేట్ గ్యారంటీలకు నో జీఎస్టీ
కార్పొరేట్, పర్సనల్ గ్యారంటీలపై జీఎస్టీ విధింపు మొదటి నుంచీ కన్ఫ్యూజన్కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ క్లారిటీ తీసుకొచ్చింది. హోల్డింగ్ కంపెనీ ఇచ్చే కార్పొరేట్ గ్యారంటీపై 18 శాతం జీఎస్టీ యదాతథంగా కొనసాగుతుందని, కానీ, కంపెనీ డైరెక్టర్లు ఇచ్చే కార్పొరేట్ గ్యారంటీకి మాత్రం జీఎస్టీ మినహాయింపు ఉంటుందని స్పష్టత ఇచ్చింది.
చెరకు రైతుల కోసం..
మొలాసిస్పై జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించాలనే ప్రపోజల్కు కూడా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇప్పటిదాకా మొలాసిస్పై 28 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఈ తగ్గింపు వల్ల చక్కెర మిల్లుల లిక్విడిటీ మెరుగుపడుతుందని, ఫలితంగా రైతులకు చెరకు బకాయిలు చెల్లించ డం ఈజీ అవుతుందని కౌన్సిల్ ఒక స్టేట్మెంట్లో పేర్కొంది. పశువుల దాణా తయారీలో మొలాసి స్ ప్రధానమైన ముడిసరుకు. అంటే, దాణా తయారీ ఖర్చు తగ్గేందుకూ దారి ఏర్పడుతుంది.