
- మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం వరకు మొదలైన పనులు
- 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణకు చర్యలు
- హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు
వేములవాడ, వెలుగు : ఐదున్నర దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వేములవాడ రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. వేములవాడ విస్తీర్ణం, జనాభాతో పాటు ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో తిప్పాపూర్ బస్టాండ్ నుంచి రాజన్న ఆలయానికి చేరుకునేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆది, సోమవారాల్లో అయితే ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. దీంతో వేములవాడలోని మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
1971లోనే ప్రపోజల్స్
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో రోడ్లు ఇరుకుగా ఉండడంతో వీటిని విస్తరించాలనే డిమాండ్ 54 ఏండ్లుగా ఉంది. ఆలయానికి వెళ్లే రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టాలని 1971లో అప్పటి సెస్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావుతో పాటు కొందరు స్థానికులు కోరడంతో అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ వెంకటరమణ ప్రపోజల్స్ రెడీ చేశారు. అయితే కొందరు స్థానిక నాయకులు వ్యతిరేకించడంతో రోడ్ల విస్తరణ ప్రపోజల్స్ స్టేజ్లోనే ఆగిపోయింది. అప్పట్లో తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి వచ్చే లారీలు, బస్సులు రాజన్న ఆలయం ముందు నుంచే వెళ్లేవి. రోడ్డు ఇరుకుగా ఉండడంతో వావాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడేవి.
ట్రాఫిక్ను తగ్గించాలన్న ఉద్దేశంతో 1993లో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కనుమూరి బాపిరాజు అధ్వర్యంలో బైసాస్ నిర్మించారు. ఈ రోడ్డు పూర్తి కావడంతో ఆలయానికి వెళ్లే రోడ్డు వెడెల్పు డిమాండ్ వెనక్కివెళ్లింది. అలాగే తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి మటన్ మార్కెట్ వరకు ఉన్న రోడ్డు మసీదు మీదుగా వంకరగా ఉండడంతో ప్రస్తుత అమరవీరుల స్థూపం నుంచి మటన్ మార్కెట్ వరకు 1989లో ఒకసారి విస్తరించారు. స్మితా సబర్వాల్ కరీంనగర్ కలెక్టర్గా పనిచేసిన టైంలో 100 ఫీట్ల రోడ్డుగా విస్తరించాలని ప్రపోజల్స్ చేశారు. మార్కింగ్ చేసిన తర్వాత ఒత్తిళ్లు పెరగడంతో విస్తరణపై వెనక్కి తగ్గారు.
పెరిగిన పట్టణం, భక్తులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్నేండ్లుగా వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటోంది. వేములవాడకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆది, సోమ వారాల్లో అయితే ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తిప్పాపూర్ వద్ద గల బస్టాండ్లో దిగి రాజన్న ఆలయానికి చేరుకోవడం ఇబ్బందిగా మారింది. రద్దీ రోజుల్లో అయితే కనీసం కాలినడకన సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు వేములవాడ పట్టణం సైతం రోజురోజుకూ విస్తరిస్తోంది. పట్టణ జనాభా గతంలో 10 వేలలోపు ఉండగా.. ప్రస్తుతం 60 వేలకు చేరుకుంది.
గతేడాది శంకుస్థాపన చేసిన సీఎం
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో వేములవాడ ఆలయాన్ని పట్టించుకోలేదు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించిన అప్పటి సీఎం కేసీఆర్... ఆ తర్వాత ఆ హామీని విస్మరించడంతో పనులు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పనుల్లో కదలిక వచ్చింది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్డు విస్తరణ పనులకు గతేడాది నవంబర్ 20న సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన
చేశారు.
ఎట్టకేలకు ప్రారంభమైన విస్తరణ పనులు
స్థానికులతో పాటు భక్తుల సమస్యను పరిష్కరించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 54 ఏండ్లుగా ప్రపోజల్స్కే పరిమితమైన పనులు ఎట్టకేలకు రెండు రోజుల కింద ప్రారంభం అయ్యాయి. పట్టణంలోని మూలవాగు బ్రిడ్జి నుంచి దేవాలయం వరకు 750 మీటర్ల మేర 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టారు. ఇందుకు రూ. 47 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
రోడ్డు విస్తరణలో 260 మంది ఇండ్లు కోల్పోతుండగా... ఇందులో 100 మందికి ఇప్పటికే నష్టపరిహారం చెక్కులు అందజేశారు. దుకాణాలు, ఇండ్లు ఖాళీ చేయాలని 15 రోజుల కిందే నోటీసులు జారీ చేసిన ఆఫీసర్లు.. ఆదివారం భవనాల తొలగింపు ప్రారంభించారు. కోర్టు స్టే ఉన్న ఇండ్లు మినహా మిగతా వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ఘటనలు జరగకుండా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య అధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పనులను సోమవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాబాయి పరిశీలించారు.
కేసీఆర్ మభ్యపెట్టారు.. మేం చేసి చూపిస్తున్నం
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల వెడెల్పును గత సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి.. ఆ తర్వాత పట్టించుకోకుండా దేవుడినే మోసం చేశారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు వెడెల్పు పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చాం.
ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే