దేశంలోనే తొలి సోలోగమీ వివాహం గుజరాత్ లోని వడోదరలో గురువారం ఉదయం జరిగింది. క్షమా బిందు అనే యువతి ఇటీవల ప్రకటించిన విధంగానే.. తనను తానే పెళ్లి చేసుకుంది. ఇలా ఎవరిని వారే పెళ్లి చేసుకోవడాన్ని ‘సోలోగమీ’ అంటారు. వాస్తవానికి గోత్రి పట్టణంలోని ఓ ఆలయంలో జూన్ 11న పెళ్లి చేసుకుంటానని క్షమా బిందు ప్రకటించింది. అయితే ఈ వివాహాన్ని అడ్డుకుంటామని కొందరు రాజకీయ నాయకులు హెచ్చరించారు. దీంతో తొలుత ప్రకటించిన తేదీ కంటే రెండు రోజులు ముందుగానే (గురువారం) ‘సోలోగమీ’ పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది.
పూజారి వేద మంత్రాలు చదువుతుండగా ఒంటరిగా ఏడడుగులు నడిచి, తానే సింధూరాన్ని ధరించి వివాహితగా మారింది. అంతకుముందు హల్దీ, మెహందీ కార్యక్రమాలు కూడా జరిగాయి. పెళ్లి ఘట్టం పూర్తయిన అనంతరం క్షమాబిందు అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఫేస్ బుక్ లో ఓ వీడియో మెసేజ్ పెట్టింది. ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫొటోలను షేర్ చేసింది.