
- ప్రజాభవన్లో స్పెషల్ కౌంటర్
- బాధితులకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా: పొన్నం ప్రభాకర్
పంజాగుట్ట, వెలుగు: గల్ఫ్ బాధితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. విదేశాల్లో ఉంటూ అనుకొని సంఘటనల్లో కేసులు ఎదుర్కొని జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ వాసుల కోసం ప్రజాభవన్లో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసింది. శుక్రవారం బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ప్రవాసీ ప్రజావాణి’ పేరుతో ఈ ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించారు. తర్వాత పొన్నం మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్లో అనుకోని ఘటనల్లో కేసులు ఎదుర్కొని జైళ్లలో మగ్గుతున్న వారిని ఎంబసీ ద్వారా ఇండియాకు తీసుకు వస్తామని, అక్కడ మృతిచెందితే కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. 2023 డిసెంబరు 9 తర్వాత గల్ఫ్ దేశాల్లో మృతిచెందిన వారందరికీ రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా వర్తిస్తుందన్నారు.
మాజీ ఐఆర్ఎస్ అధికారి పర్యవేక్షణలో
మాజీ ఐఆర్ఎస్ అధికారి పర్యవేక్షణలో గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్గా ఉన్న బి.ఎం.వినోద్ కుమార్ దీనిని పర్యవేక్షించనున్నారు. గల్ఫ్లో మనవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే అవి సెక్రటేరియెట్లోని జీఏడికి చేరుకుంటాయి. అక్కడ ఒక మానిటరింగ్ సెల్ ఉంటుంది. దాని ద్వారా ఆయా దేశాల రాయబారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తారు. దీని కోసం ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రజావాణి ఇన్చార్జ్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నోడల్ అధికారి దివ్య దేవరాజన్, ఎన్నారై విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.