దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. మరో వైపు ప్రజలు వాటిని లెక్క చేయకుండా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మరణాల సంఖ్య తీవ్ర స్థాయిలోనే ఉంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సినేషన్కు ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో గుర్గావ్లోని ఓ రెస్టారెంట్ వినూత్న ఆఫర్ ప్రకటించింది. టీకా వేయించుకో..ఫ్రీగా బీరు తీస్కెళ్లు అంటూ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బీర్ ఉచితంగా ఇస్తామని బంపరాఫర్ ప్రకటించింది.
హర్యానాలోని గుర్గావ్లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ ఈ ఆఫర్ ప్రకటించింది. టీకా వేసుకున్న తర్వాత ఆ టీకా కార్డు చూపిస్తే ఫ్రీ బీర్ ను ఆఫర్ చేస్తోంది. టీకాలు వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్టు రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది.