15%  హెచ్​1బీ  వీసాల్లో కోత!

15%  హెచ్​1బీ  వీసాల్లో కోత!

న్యూఢిల్లీ: ఇండియన్లకు ఇచ్చే హెచ్​1బీ వీసాల్లో అమెరికా కోత పెడుతోందా? ట్రేడ్​వార్​ను మరింత ముందుకు తీసుకుపోతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. హెచ్​1బీ వీసాలపై ఎక్కువగా వెళుతున్న ఇండియన్లకే ఆ కోత మరింత పడుతుందని తెలుస్తోంది. ఇప్పుడు ఏటా ఇస్తున్న వీసాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తామని అమెరికా నుంచి కబురు అందినట్టు ముగ్గురు అధికారులు చెప్పారు. డేటాను లోకల్​గా స్టోర్​ (డేటా లోకలైజేషన్​) చేయాలని అమెరికా కంపెనీలను ఒత్తిడి చేసే దేశాలకు హెచ్​1బీ వీసాలపై పరిమితులు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించిందని వివరించారు. ఇండియాలో కంపెనీ వ్యవహారాలను నడిపిస్తే డేటానూ ఇక్కడే భద్రపరచాలని విదేశీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూల్​ పెట్టింది. కీలక వాణిజ్య భాగస్వామిగా మన దేశానికి ఉన్న హోదాను అమెరికా తొలగించిన కారణంతో ఇటీవల 28 అమెరికా వస్తువులపైనా మనోళ్లు టారిఫ్​ పెంచారు. అందుకే అమెరికా ఈ వీసాల కోత నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

10  నుంచి 15% కోత

ఏటా ఇండియన్లకు ఇస్తున్న హెచ్​1బీ వీసాల్లో 10 నుంచి 15 శాతం కోత పెట్టాలని అమెరికా నిర్ణయించినట్టు గతవారమే తమకు ప్రభుత్వం వివరించిందని ఇద్దరు సీనియర్​ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీల పప్పులుడకకుండా వాటి అధికారాలను తగ్గించేందుకు ఇండియా తీసుకున్న ‘డేటా లోకలైజేషన్​’పైనే అమెరికా ఈ వీసా తగ్గింపు నిర్ణయం తీసుకుందన్నారు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. అయితే, ఒక్క ఇండియా మాత్రమే కాకుండా డేటా లోకలైజేషన్​కు డిమాండ్​ చేసే దేశాలన్నింటికీ ఇది వర్తించేలా నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఏ దేశమైతే డేటా లోకలైజేషన్​కు డిమాండ్​ చేస్తుందో ఆ దేశానికి ఏటా ఇచ్చే వీసాల్లో 15 శాతం వీసాలను కోత పెట్టేందుకు డిసైడ్​ అయిందన్నారు. అమెరికా ట్రేడ్​ రిప్రజెంటేటివ్​ (యూఎస్​టీఆర్​) ఆఫీస్​కు చెందిన ఓ మహిళా ప్రతినిధి.. విదేశాంగ శాఖను ఇదే విషయంపై ప్రశ్నించినా స్పందించలేదు.

ఐటీ రంగానికే నష్టం

ఒకవేళ అమెరికా వీసాలను తగ్గిస్తే భారీగా ప్రభావం పడేది మాత్రం ఇండియన్​ కంపెనీలపైనేనని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​), ఇన్ఫోసిస్​లపైనే ప్రభావం ఎక్కువుంటుందని అంటున్నారు. అయితే, అమెరికా నిర్ణయంతో దేశంపై పడే ప్రభావమేంటో వెంటనే తేల్చాల్సిందిగా అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించినట్టు సమాచారం. విదేశాంగ శాఖ మాత్రం దీనిపై స్పందించలేదు. ఇక, విదేశీ కంపెనీల పేమెంట్స్​ డేటాను ‘ఇండియాలోనే’ స్టోర్​ చేయాలని గత ఏడాదే కేంద్ర ప్రభుత్వం రూల్​ పెట్టింది. సున్నితమైన అంశాలను ప్రాసెస్​ చేసే విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, అందులో భాగంగానే డేటాను ఇక్కడే స్టోర్​ చేయాలని కంపెనీలను ఆదేశించింది. దీని వల్ల అమెరికా కంపెనీలైన మాస్టర్​కార్డ్​, వీసా వంటి కంపెనీలు భారీగా నష్టపోయాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి రూల్స్​ పెట్టడం వల్ల దేశాల మధ్య డేటా మార్పిడి ఆగిపోతుందని, కంపెనీలకు ఖర్చు పెరుగుతుందని కొందరు నిపుణులు విమర్శలు గుప్పించారు.