
న్యూఢిల్లీ: ఇండియన్లకు ఇచ్చే హెచ్1బీ వీసాల్లో అమెరికా కోత పెడుతోందా? ట్రేడ్వార్ను మరింత ముందుకు తీసుకుపోతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. హెచ్1బీ వీసాలపై ఎక్కువగా వెళుతున్న ఇండియన్లకే ఆ కోత మరింత పడుతుందని తెలుస్తోంది. ఇప్పుడు ఏటా ఇస్తున్న వీసాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తామని అమెరికా నుంచి కబురు అందినట్టు ముగ్గురు అధికారులు చెప్పారు. డేటాను లోకల్గా స్టోర్ (డేటా లోకలైజేషన్) చేయాలని అమెరికా కంపెనీలను ఒత్తిడి చేసే దేశాలకు హెచ్1బీ వీసాలపై పరిమితులు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించిందని వివరించారు. ఇండియాలో కంపెనీ వ్యవహారాలను నడిపిస్తే డేటానూ ఇక్కడే భద్రపరచాలని విదేశీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. కీలక వాణిజ్య భాగస్వామిగా మన దేశానికి ఉన్న హోదాను అమెరికా తొలగించిన కారణంతో ఇటీవల 28 అమెరికా వస్తువులపైనా మనోళ్లు టారిఫ్ పెంచారు. అందుకే అమెరికా ఈ వీసాల కోత నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
10 నుంచి 15% కోత
ఏటా ఇండియన్లకు ఇస్తున్న హెచ్1బీ వీసాల్లో 10 నుంచి 15 శాతం కోత పెట్టాలని అమెరికా నిర్ణయించినట్టు గతవారమే తమకు ప్రభుత్వం వివరించిందని ఇద్దరు సీనియర్ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీల పప్పులుడకకుండా వాటి అధికారాలను తగ్గించేందుకు ఇండియా తీసుకున్న ‘డేటా లోకలైజేషన్’పైనే అమెరికా ఈ వీసా తగ్గింపు నిర్ణయం తీసుకుందన్నారు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. అయితే, ఒక్క ఇండియా మాత్రమే కాకుండా డేటా లోకలైజేషన్కు డిమాండ్ చేసే దేశాలన్నింటికీ ఇది వర్తించేలా నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఏ దేశమైతే డేటా లోకలైజేషన్కు డిమాండ్ చేస్తుందో ఆ దేశానికి ఏటా ఇచ్చే వీసాల్లో 15 శాతం వీసాలను కోత పెట్టేందుకు డిసైడ్ అయిందన్నారు. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) ఆఫీస్కు చెందిన ఓ మహిళా ప్రతినిధి.. విదేశాంగ శాఖను ఇదే విషయంపై ప్రశ్నించినా స్పందించలేదు.
ఐటీ రంగానికే నష్టం
ఒకవేళ అమెరికా వీసాలను తగ్గిస్తే భారీగా ప్రభావం పడేది మాత్రం ఇండియన్ కంపెనీలపైనేనని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్లపైనే ప్రభావం ఎక్కువుంటుందని అంటున్నారు. అయితే, అమెరికా నిర్ణయంతో దేశంపై పడే ప్రభావమేంటో వెంటనే తేల్చాల్సిందిగా అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించినట్టు సమాచారం. విదేశాంగ శాఖ మాత్రం దీనిపై స్పందించలేదు. ఇక, విదేశీ కంపెనీల పేమెంట్స్ డేటాను ‘ఇండియాలోనే’ స్టోర్ చేయాలని గత ఏడాదే కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. సున్నితమైన అంశాలను ప్రాసెస్ చేసే విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, అందులో భాగంగానే డేటాను ఇక్కడే స్టోర్ చేయాలని కంపెనీలను ఆదేశించింది. దీని వల్ల అమెరికా కంపెనీలైన మాస్టర్కార్డ్, వీసా వంటి కంపెనీలు భారీగా నష్టపోయాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల దేశాల మధ్య డేటా మార్పిడి ఆగిపోతుందని, కంపెనీలకు ఖర్చు పెరుగుతుందని కొందరు నిపుణులు విమర్శలు గుప్పించారు.