హెచ్​1బీ వీసాలు 10% తగ్గినయ్‌‌

హెచ్​1బీ వీసాలు 10% తగ్గినయ్‌‌

వాషింగ్టన్​ : హెచ్​1బీ వీసాల్లో అమెరికా కోత పెడుతోంది. ఇప్పటికే వీసా జారీకి సంబంధించి కఠిన నిబంధనలు పెడుతున్న ట్రంప్​ సర్కార్​.. గత ఏడాది వీసాల్లో 10 శాతం తగ్గించేసింది. 2018 ఆర్థిక సంవత్సరంలో కొత్తవి, మళ్లీ ఇష్యూ చేసినవి కలిపి 3.35 లక్షల వీసాలను అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూఎస్​సీఐఎస్​) విభాగం ఆమోదించింది. వార్షిక నివేదిక ప్రకారం 2017లో ఆ సంఖ్య 3 లక్షల 73వేల 400. అంటే గత ఏడాది ఇచ్చిన వీసాల్లో కోత 10 శాతానికిపైనే నమోదైంది. వీసాల జారీ రేటు కూడా ఈసారి చాలా తగ్గింది. 2017లో 93 శాతంగా ఉంటే, గత ఏడాది 85 శాతానికి పడిపోయింది. హెచ్​1బీ వీసాలను ఇవ్వడంపై అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని, అది ఈ లెక్కల్లో స్పష్టంగా తెలుస్తోందని మైగ్రేషన్​ పాలసీ ఇనిస్టిట్యూట్​ అనలిస్టు సారా పియర్స్​ చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి వీసాల జారీ రేటు 85 నుంచి 79 శాతానికి పడిపోయిందన్నారు. 2018లో 3 లక్షల 96వేల 300 వీసాలను పరిశీలించిన యూఎస్​సీఐఎస్​, 2017లో 4 లక్షల 3 వేల 300 వీసాలను ప్రాసెస్​ చేసింది. గత ఏడాది 8.5 లక్షల నేచురలైజేషన్​ పిటిషన్లకు ఓకే చెప్పింది. 11 లక్షల మందికి గ్రీన్​ కార్డులను మంజూరు చేసింది.

బ్యాక్​ వేజ్​ చెల్లిస్తాం

600 మంది హెచ్​1బీ వీసాదారులకు ఇవ్వాల్సిన బ్యాక్​వేజెస్​ చెల్లిస్తామని అమెరికాకు చెందిన పాపులస్​ గ్రూప్​ అనే సంస్థ ప్రకటించింది. ఓ ఉద్యోగికి ఇవ్వాల్సిన జీతానికి, ఇస్తున్న జీతానికి ఉన్న తేడానే బ్యాక్​వేజెస్​ అంటారు. ఉదాహరణకు ఉద్యోగికి పది వేల రూపాయలు జీతం ఉందనుకుందాం. కానీ, అతడికి కంపెనీ 5 వేలే ఇస్తోంది. తేడా ఆ ఐదు వేలను బ్యాక్​వేజ్​ కింద లెక్కగడతారు. ఇప్పుడు ఆ బ్యాక్​వేజెస్​నే ఇస్తామని కంపెనీ తెలిపింది. 11 లక్షల డాలర్ల (సుమారు ₹7.62 కోట్లు)ను ఉద్యోగులకు ఇస్తామని కంపెనీ చెప్పింది. ఆ 600 మందిలోనూ
ఎక్కువగా ఇండియన్లే ఉన్నారు. దీంతో వారికి లబ్ధి చేకూరనుంది.

డ్రీమర్లకు సాయం చేద్దాం

డ్రీమర్లకు సాయపడే బిల్లును డెమొక్రాట్లు ఎక్కువగా ఉన్న అమెరికా హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​ ఆమోదించింది. ఏ పత్రాలు లేని లక్షలాది మంది వలసవాదులు చట్టబద్ధంగా బతికేలా ఆ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ టేబుల్​ వరకు ఆ బిల్లొస్తే, వీటో పవర్​ను వాడి దాన్ని రద్దు చేస్తామని వైట్​హౌస్​ హెచ్చరించింది. ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించి పెరిగి పెద్దయిన పిల్లలను డ్రీమర్లు అంటారు. అలాంటి వాళ్లను దేశ జనంగా గుర్తించి పౌరసత్వం కల్పించేందుకు పెట్టిన బిల్లును 237 మంది సభ్యులకు గానూ 187 మంది ఆమోదించారు. కాగా, ఇప్పుడు చాలా మంది డ్రీమర్లు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా ప్రవేశపెట్టిన డాకా (డీఏసీఏ) ప్రోగ్రాం ద్వారా రక్షణ పొందుతున్నారు. మరికొందరు టెంపరీ ప్రొటెక్టెడ్​ స్టేటస్​ (టీపీఎస్​) కింద దేశంలో ఉంటున్నారు. ఇప్పుడు, డాకాను, టీపీఎస్​ను రద్దు చేసేందుకు ట్రంప్​ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డాకా కింద 7 లక్షల మంది, టీపీఎస్​ కింద 3 లక్షల మంది డ్రీమర్లు అమెరికాలో బతుకుతున్నారు.