- వారం రోజుల్లో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు 4 కంప్లయింట్స్
హైదరాబాద్, వెలుగు: ఇన్స్టంట్ లోన్ యాప్స్ వేధింపులు మళ్లీ మొదలైనయ్. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చైనా యాప్స్ తరహాలోనే మళ్లీ కాల్ సెంటర్స్ బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్ లోన్ తీసుకున్న వారిని అసభ్యకరంగా తిడుతూ, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టింగ్స్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్, పెనాల్టీ పేరుతో సుమారు 35 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. కాల్ సెంటర్స్ వేధింపులకు గురైన నలుగురు బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. వారం రోజుల్లోనే ఈ 4 కేసులు రావడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కాల్సెంటర్స్, లోన్ యాప్స్ లింకులను సెర్చ్ చేస్తున్నారు.
లక్షా 10 వేల లోన్కు రూ.2 లక్షల 94 వేలు వసూలు
యూసుఫ్గూడకు చెందిన ఓ యువతి లేడీస్ ఎంపోరియం నిర్వహిస్తోంది. షాప్ అవసరాల కోసం కిందటి నెల క్రితం పర్సనల్ లోన్ తీసుకునేందుకు ట్రై చేసింది. మొబైల్ క్రెడిట్ యాప్లో లక్షా 10 వేలు అప్పుగా తీసుకుంది. ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసేకునే టైమ్ లోనే ఆమె కండీషన్స్ కు ఒకే చెప్పింది. దీంతో యాప్ నిర్వాహకులు ఆమెకు తెలిసిన ఇద్దరి ఫోన్ నంబర్స్ తీసుకున్నారు. యాప్ ఇన్స్టాల్ చేసే క్రమంలో యువతి కాంటాక్ట్స్లోని ఫోన్ నంబర్స్ను కలెక్ట్ చేశారు. వారం రోజుల టైం బాండ్తో ఆమెకు రూ.లక్షా 10 వేలు డిపాజిట్ చేశారు. వారం రోజుల గడువు ముగిసినా పేమెంట్ చేయకపోవడంతో యువతికి కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తూ తిడుతూ వేధించారు. పెనాల్టీస్, ఇంట్రెస్ట్, జీఎస్టీ, సర్వీస్ చార్జెస్ 35 శాతం అదనంగా వేసి ఆమె నుంచి రూ.2.94 లక్షలు వసూలు చేశారు.
వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పోస్టులు
కృష్ణానగర్కు చెందిన ఓ మహిళ రూ.33 వేలు ఇన్ స్టంట్ లోన్ తీసుకుంది. వారం రోజుల్లో తిరిగి చెల్లించింది. తర్వాత మళ్లీ రెండు సార్లు లోన్ తీసుకుంది. గడువులోగా చెల్లించకపోవడంతో నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇంట్రెస్ట్, పెనాల్టీలు వేశారు. ఫేక్ నోటీస్ లెటర్లతో బ్లాక్ మెయిల్ చేశారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ను యాడ్ చేసి వేధించారు. లేట్ పేమెంట్స్, ఛార్జీలు చెల్లించాలంటూ వాట్సాప్ గ్రూపులో అసభ్యకర పోస్టింగ్స్ చేశారు. ఆమె నుంచి రూ.లక్ష వసూలు చేశారు. దీంతో బాధితురాలు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లయింట్ చేసింది.
రూ.5 వేలు ఇచ్చి ఆగంజేసిన్రు
ఓల్డ్ సిటీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ తన అవసరాల కోసం ఈ నెల 5న ‘గో క్యాష్ యాప్’ లో సెర్చ్ చేశాడు. యాప్లో కండీషన్స్ తెలియకుండానే పర్మిషన్లను యాక్సెప్ట్ చేశాడు. రూ.5 వేలు లోన్ తీసుకునేందుకు రిక్వెస్ట్ పెట్టాడు. యాప్లోని ఆటోమెటిక్ సిస్టమ్ ద్వారా అతడి మొబైల్ కాంటాక్ట్స్ను నిర్వాహకులకు అందించాడు. గత వారం చెల్లించాల్సిన డబ్బును అతడు డిపాజిట్ చేయలేదు. దీంతో కాల్సెంటర్ నుంచి వరుసగా ఫోన్లు రావడం మొదలయ్యాయి. ముందుగా కాల్ చేసిన వ్యక్తులు అమౌంట్ డేట్ వివరాలు తెలిపారు. ఆ తర్వాత కాల్ చేసిన వాళ్లు అతడిపై కేసులు పెడతామని బెదించారు. దీంతో బాధితుడు ఈ నెల 19న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.