బషీర్బాగ్, వెలుగు: హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ సంస్థ ఎంతో మంది ఆకలిని తీరుస్తున్నదని హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం. ప్రియదర్శిని అన్నారు. శనివార హరే కృష్ణ వార్షిక సాంస్కృతికోత్సవం ‘హెరిటేజ్ ఫెస్ట్’ రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. సంస్థ సాంస్కృతిక విభాగం ‘సుమేధస’ ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి, వైభవం, చరిత్రపై స్టూడెంట్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చీఫ్ గెస్టుగా హాజరైన జస్టిస్ ప్రియదర్శిని మాట్లాడుతూ... హరే కృష్ణ అక్షయ పాత్ర, భోజనామృతం, అన్నపూర్ణ మిడ్ డే మిల్స్ లాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. విదేశీ మోజుతో దేశాన్ని కించపరచకూడదన్నారు. భారతదేశంలో పుట్టడం మన అదృష్టంగా భావించి గర్వపడాలన్నారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విదేశాల్లో కంపెనీలకు సీఈవో స్థాయికి చేరుకుని రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నా దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలన్నారు. బాల్య వివాహాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
రాష్ట్రంలో పొక్సో కేసులు పెరుగుతున్నాయని... ఈ యాక్ట్పై అవగాహన అవసరమని సూచించారు. వివాహ వ్యవస్థ దెబ్బ తింటోందని చిన్న, చిన్న గొడవలకే దంపతులు విడిపోతున్నారని జస్టిస్ ప్రియదర్శిని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం ఇందుకు కారణమని ఆమె తెలిపారు. అనంతరం హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్, అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస్ ప్రభుజీ మాట్లాడుతూ.. హరే కృష్ణ మూవ్మెంట్ అంటే అందరికీ అక్షయ పాత్ర గుర్తుకు వస్తుందన్నారు. అక్షయ పాత్ర ప్రపంచంలోనే అతి పెద్ద కిచెన్ అని ఆయన తెలిపారు. అక్షయపాత్ర ద్వారా 20 లక్షల మంది పిల్లలకు మిడ్ డే మీల్స్, అన్నపూర్ణ ద్వారా 40 వేల మందికి రూ. 5కే భోజనం అందిస్తున్నామన్నారు. ఈ హెరిటేజ్ ఫెస్ట్ తో స్టూడెంట్లు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంచుకుంటారని వివరించారు. సమ్మర్ హాలిడేస్ లో కల్చరల్ క్యాంప్స్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. హెరిటేజ్ ఫెస్ట్ పాల్గొన్న స్టూడెంట్లకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు.