
హైదరాబాద్, వెలుగు: బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. ‘‘ఆరు గ్యారంటీల్లాగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలే ఆడింది. 55 ఏండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటుపడిందా? రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే జాతీయ నాయకులతో ఢిల్లీ వేదికగా కొట్లాడాలి. బీఆర్ఎస్ తరఫున మేం కలిసి వస్తం” అని ఆయన గురువారం ట్వీట్ చేశారు. ‘‘మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని కుట్రలు చేసింది. ఆ కుట్రలు పటాపంచలయ్యాయి. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి.. గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారు తప్ప బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ధి ప్రదర్శించలేదు” అని దుయ్యబట్టారు. బీసీల పట్ల నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి నాటకాలాడారని ఆరోపించారు.