మరోసారి కేసీఆర్​తో హరీశ్ రావు భేటీ!..కాళేశ్వరం కమిషన్​ విచారణకు హాజరవడంపై చర్చ

మరోసారి కేసీఆర్​తో హరీశ్ రావు భేటీ!..కాళేశ్వరం కమిషన్​ విచారణకు హాజరవడంపై చర్చ

హైదరాబాద్​, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​తో మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్​ రావు మరోసారి భేటీ అయ్యారు. బుధవారం ఎర్రవల్లి ఫాంహౌస్​లో కేసీఆర్​తో సమావేశమైన హరీశ్​.. కాళేశ్వరం కమిషన్​ ఇచ్చిన నోటీసులపై చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ వారంలో రెండు సార్లు భేటీ అయిన ఇద్దరు నేతలు.. ఇప్పుడు మరోసారి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

కమిషన్​ విచారణకు హాజరవ్వాలని కేసీఆర్​ నిర్ణయించారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కమిషన్​ అడిగే ప్రశ్నలకు ఎలా స్పందించాలన్న దానిపై ఇద్దరు నేతల మధ్య డిస్కషన్​ జరిగినట్టు తెలిసింది. తమ హయాంలో తీసుకున్న విధాన, ఆర్థికపరమైన నిర్ణయాలపైనా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే విచారణకు హాజరైన పలువురు ఇంజినీర్ల ద్వారా.. కమిషన్​ అడుగుతున్న ప్రశ్నలు, స్పందిస్తున్న తీరు గురించి ఇద్దరు నేతలు ఆరా తీసినట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే కమిషన్​ విచారణలో ఇచ్చే స్టేట్​మెంట్లపై చర్చించినట్టు తెలుస్తున్నది. 

వేల కోట్లు దండుకునే నాటకం: హరీశ్​

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట వేల కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ ఆడుతున్న మరో నాటకం బయటపడిందని హరీశ్​రావు అన్నారు. ‘‘నిరుడు జులై 24న ఆదిలాబాద్​లో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. యంగ్​ ఇండియా స్కూళ్లను రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని చెప్పారు. కానీ, అదే ఏడాది అక్టోబర్​ 11న రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజకవర్గంలో స్కూల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం రేవంత్​ తెలిపారు”అని హరీశ్​రావు గుర్తు చేశారు.

వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు 2025 మే రెండో వారంలో రూ.135- కోట్ల నుంచి రూ.150 కోట్లతో టెండర్లనూ ఖరారు చేశారని తెలిపారు. తాజాగా, ఈ నెల 27న 20 స్కూళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.4 వేల కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేశారన్నారు. అంటే స్కూళ్ల పనులు మొదలు కాకుండానే ఒక్కో స్కూల్​ నిర్మాణ వ్యయాన్ని రూ.200 కోట్లకు పెంచారని ఆరోపించారు.