పార్లమెంట్ షెడ్యూల్ ​లోపే గ్యారంటీలు అమలు చేయాలి: హరీశ్ రావు

పార్లమెంట్ షెడ్యూల్ ​లోపే గ్యారంటీలు అమలు చేయాలి: హరీశ్ రావు
  • పార్లమెంట్ షెడ్యూల్ ​లోపే గ్యారంటీలు అమలు చేయాలి
  • ఎగవేతలు, దాటవేతలకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది: హరీశ్
  • రైతుబంధు సాయం ఎంతమందికి అందిందో క్లారిటీ ఇవ్వాలి
  • కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా మా ఖాతాలో వేసింది
  • ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్​ ఉల్లంఘన జరుగుతున్నది
  • మీడియా చిట్​చాట్​లో మాజీ మంత్రి వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: ఫిబ్రవరి నెలాఖరులో పార్లమెంట్​ఎన్నికల షెడ్యూల్​వచ్చే అవకాశముందని, అంతకు వారం రోజుల ముందే ఆరు గ్యారంటీలు,13 హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఆదివారం బీఆర్ఎస్​ఎల్పీలో ఆయన మీడియాతో చిట్​చాట్​ చేశారు. 

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి మార్చి17వ తేదీతో వంద రోజులు పూర్తవుతుందని, 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఆ పార్టీ చెప్పినా అప్పటికే ఎన్నికల కోడ్​వచ్చే అవకాశముండటంతో వాటికి బ్రేక్​పడే ప్రమాదముందన్నారు. తాను జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు గ్యారంటీల అమలు, రైతుబంధుపై ప్రజల నుంచి అనేక సందేహాలు ఎదురయ్యాయని, వాటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వానికి ఆరు గ్యారంటీల అమలుపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్​ఎన్నికల షెడ్యూల్​వచ్చే లోపే పూర్తి స్థాయి బడ్జెట్​ప్రవేశపెట్టి గ్యారంటీల అమలుకు గైడ్​లైన్స్​ఇచ్చి, ఆయా స్కీంలను గ్రౌండింగ్​చేయాలని కోరారు. ఒకవేళ షెడ్యూల్​వస్తే కొత్త స్కీంల అమలు సాధ్యం కాదని, పార్లమెంట్​ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాల్సి ఉంటుందన్నారు. యాసంగి వడ్లకు క్వింటాల్​కు రూ.500 బోనస్​ఇచ్చే పథకానికి సంబంధించిన గైడ్​లైన్స్​కూడా వెంటనే రిలీజ్​చేయడంతో పాటు, బడ్జెట్​లోనూ ఆ స్కీమ్​ను చేర్చాలని సూచించారు.

జాప్యం చేస్తారనే అనుమానం..

ప్రభుత్వం ఏదైనా స్కీంను అమలు చేయాలంటే దానికి సంబంధించిన విధివిధానాలు రూపొం దించి ఆ తర్వాత ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని, కానీ కాంగ్రెస్​ప్రభుత్వం గైడ్​లైన్స్​లేకుండానే దరఖాస్తులు తీసుకుందామన్నట్టు వ్యవహరిస్తోందన్నారు. అందుకే ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారని, వాటిని ఆన్​లైన్​చేయడం పేరుతో ఆయా స్కీంల అమలులో జాప్యం చేయాలని చూస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. గ్యారంటీల అమలుకు బడ్జెట్​కేటాయింపుతో పాటు గైడ్​లైన్స్​రిలీజ్​చేసి, స్కీంలను గ్రౌండింగ్​చేస్తే ఎన్నికల కోడ్​వచ్చినా వాటి అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. వాళ్లలా తాము ఈసీకి ఫిర్యాదులు చేసి అడ్డుకోబోమన్నారు. కాంగ్రెస్​పార్టీ అలాగే రైతుబంధును ఆపిందని, ఇంతవరకు ఎంతమందికి రైతుబంధు ఇచ్చారనే దానిపై స్పష్టత లేదన్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలన్నా ఫిబ్రవరి 20లోపే చేయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్​కాకుండా ఓట్​ఆన్​ఎకౌంట్​బడ్జెట్​పెట్టిందంటే హామీల అమలు ఎగవేతకు సిద్ధమైనట్టే అని అనుమానించాల్సి ఉంటుందన్నారు.

1400 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం

అధికారంలోకి వచ్చాక కొత్త ప్రభుత్వం 1,400 కోట్ల అప్పు చేసిందని, మార్చి నెలాఖరు వరకు చేసే రూ.13 వేల కోట్ల అప్పులను కూడా శ్వేతపత్రంలో తమ ప్రభుత్వం ఖాతాలోనే వేశారని హరీశ్​రావు అన్నారు. కాంగ్రెస్​పార్టీ ఎన్నికలకు ముందు జాబ్​క్యాలెండర్​పేరుతో పేపర్లలో ప్రకటనలు ఇచ్చిందని, దానికి అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ప్రయత్నించాలన్నారు. మాటకు ముందు అప్పులు, ఖాళీ కుండలు అని చెప్పేవాళ్లకు హామీలిచ్చేప్పుడు బడ్జెట్​పై అవగాహన లేదా అని ప్రశ్నించారు. కార్లు కొని దాచిపెట్టుకోవడం ఉంటుందా.. సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడి స్థాయిని దిగజార్చుకోవద్దన్నారు. ప్రగతి భవన్​లో 200 రూములు, స్విమ్మింగ్​ఫూల్, బుల్లెట్​ప్రూఫ్​బాత్రూంలు ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారని, ఇప్పుడు అందులో నివాసం ఉంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏది నిజమో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రొటోకాల్​ఉల్లంఘన జరుగుతోందని, నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా ఓడిపోయిన కాంగ్రెస్​ నేతలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వచ్చాకే కార్యక్రమాలు ప్రారంభించే వారిమని హరీశ్​ రావు గుర్తు చేశారు. 

నిరుద్యోగ భృతి ఎగ్గొట్టే ప్రయత్నం..

రాహుల్​గాంధీ, ప్రియాంక హామీ ఇచ్చిన, మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి అమలును ఎగవేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీశ్​రావు అన్నారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాము ఇలాంటి హామీ ఇవ్వలేదని చెప్పడమే దీనికి నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వం ధోరణి చూస్తుంటే హామీల అమలులో ఎగవేతలు.. వాటిలో కోతలు.. తర్వాత చేస్తాంలే అనే దాటవేతలు అనిపిస్తోందన్నారు. యాసంగి పంటకైనా క్వింటాలు వడ్లకు రూ.500 చొప్పున బోనస్ ​ఇవ్వాలన్నారు. డిసెంబర్​ 9వ తేదీన్నే రైతు భరోసా, రూ.2 లక్షల రుణాలు మాఫీ, ఆసరా పింఛన్ల పెంపు, 200లోపు యూనిట్ల కరెంట్​బిల్లులు మాఫీ హామీలు ఇచ్చారని, వాటిని వీలైనంత త్వరగా అమలు చేయాలన్నారు. కిడ్నీ, లివర్, లంగ్స్, హార్ట్​ట్రాన్స్​ప్లాంటేషన్​సహా పెద్ద జబ్బులకు వైద్యం చేసేందుకు తమ ప్రభుత్వం రూ.11.50 లక్షల వరకు ఆరోగ్య శ్రీ కింద చెల్లించిందని, కొత్త ప్రభుత్వంలో ఈ స్కీం ఎంతమందికి వర్తింపజేశారనే వివరాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.