- టైమ్ వేస్ట్ చేయకుండా హామీల అమలుపై దృష్టి పెట్టండి
- ప్రజా పాలనలో వచ్చిన 1.25 కోట్ల అప్లికేషన్లకు మోక్షం కల్పించండి
- వంద రోజులు గడిచాక.. కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉడకవ్
- పార్టీ పరంగా తప్పులు జరిగుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు
- తమను మన్నించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పేదల పొట్టకొడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ లోక్ సభ సన్నాహక సమావేశం సెకండ్ సెషన్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కన్నా బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధించడమే ధ్యేయంగా పని చేస్తుందని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటి స్వరూపాన్ని మార్చాలని చూడడం దుర్మార్గమన్నారు. అనవసరమైన వాటిపై టైమ్ వేస్ట్ చేసే బదులు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజా పాలనకు వచ్చిన 1.25 కోట్ల అప్లికేషన్లకు వెంటనే మోక్షం కల్పించాలన్నారు. కాంగ్రెస్కు వంద రోజుల గడువుందని, తర్వాత ఆ పార్టీ పప్పులు ఉడకవన్నారు. పార్టీ పరంగా ఏమైనా తప్పులు జరిగి ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అందుకు మన్నించాలని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్నా పట్టు దల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తున్నదని హరీశ్ అన్నారు. లోపాలను సమీక్షించుకొని వాటిని పునరావృతం కాకుండా కలిసి పని చేద్దామన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేకుంటే తెలంగాణ గళం వినిపించే వారే ఉండరని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో సఖ్యంగా లేదని సీఎం అంటున్నారని, ఇదే పెద్ద మనిషి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాము కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిస్తే బీజేపీతో కుమ్మక్కు అయ్యిందని ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. విభజన హామీలు సహా రాష్ట్ర సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టిందన్నారు.