తెలంగాణను మోసం చేసిన పార్టీ బీజేపీ : మంత్రి హరీశ్రావు

తెలంగాణను మోసం చేసిన పార్టీ బీజేపీ : మంత్రి హరీశ్రావు
  • బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి హరీశ్​రావు ఫైర్

జోగిపేట, వెలుగు: బీజేపీ అంటేనే తెలంగాణను మోసం చేసిన పార్టీ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సోమవారం మాజీ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్​ఆధ్వర్యంలో వట్​పల్లి మండల కేంద్రంలో అలయ్​బలయ్​నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్​రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వడ్లకో నీతి, గోధమలకో నీతా అని అడిగే  దమ్ము బీజేపీ ఎంపీలకు ఉందా అని ప్రశ్నించారు. సబ్​కా సాత్​, సబ్​కా వికాస్​ కాదు పూరా బక్వాస్​అన్నారు. ఏపీలో క్షణాల్లో ప్యాకేజీలు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే  కేంద్రం మెడలు వంచి పనులు చేయించుకోవచ్చన్నారు.

 మరోవైపు గ్యారంటీలను చట్టబద్ధత చేస్తామని చెప్పి ఓట్లు దండుకొని కాంగ్రెస్​గద్దెనెక్కి  తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. అధికారంలోకి రాగానే అవ్వకు రూ.4వేలు పింఛన్​అన్నారు. అత్తకిస్తే కోడలుకు ఎగ్గొట్టి, కోడలికిస్తే అత్తకు ఎగ్గొట్టిందన్నారు. రేవంత్​రెడ్డి వచ్చాక కొత్త పింఛన్​లు దేవుడెరుగు కానీ ఉన్న పింఛన్​లలో కోత విధించారన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రేస్సోళ్లు ఓట్లడగటానికి వస్తే పింఛన్​లు ఏమయ్యాయని నిలదీయండని పిలుపునిచ్చారు. 

కేసీఆర్​హయాంలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందన్నారు. అందోల్​ నియోజకవర్గంలో తమ హయాంలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఎందుకు బంద్​పెట్టిందన్నారు. ఈ విషయంపై త్వరలో ప్రజల మద్దతతో పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు ప్రభాకర్, మాణిక్​రావు, మాజీ జడ్పీ చైర్​పర్సన్​మంజుల, తదితరులు పాల్గొన్నారు.