సీతారామకు మా హయాంలోనే అనుమతులు : హరీశ్​ రావు

సీతారామకు మా హయాంలోనే అనుమతులు : హరీశ్​ రావు
  • బీఆర్ఎస్​ కట్టిన ప్రాజెక్టుల దగ్గర ఫొటోలకు పోజులిస్తున్నరు: హరీశ్​ రావు
  • 2018లోనే సీడబ్ల్యూసీకి డీపీఆర్​లను సమర్పించినం
  • సీతారామకు అనుమతుల్లేవని ఉత్తమ్​ మాట్లాడడం అవగాహనారాహిత్యమని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మాట్లాడడం అవగాహనారాహిత్యమని, టీఏసీ తప్ప అన్ని అనుమతులు తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్ దగ్గర ఫొటోలకు పోజులిచ్చి, అదే ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2018 అక్టోబర్​ 30నే సీతారామ ప్రాజెక్టు డీపీఆర్​ను సెంట్రల్​ వాటర్​ కమిషన్​(సీడబ్ల్యూసీ)కి బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో అందజేశామని హరీశ్​ రావు అన్నారు. 

అక్కడ 113.795 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2021 సెప్టెంబర్, అక్టోబర్​లోనే సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం నిర్ధారించిందని గుర్తు చేశారు. 70.4 టీఎంసీలను సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చని కేంద్రం 2021లో నిర్ధారించిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు ఇంత స్పష్టంగా సీడబ్ల్యూసీ హైడ్రాలజీ అనుమతులున్నా.. నీటి కేటాయింపులే జరగలేదంటూ మంత్రి ఉత్తమ్​ మాట్లాడడం.. కాంగ్రెస్​ సర్కారు చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి దోపిడీకి అడ్డుకోకుండా పదవుల కోసం పెదవులు మూసుకున్న కాంగ్రెస్​ నేతలు, ఇప్పుడు మరోసారి తెలంగాణ నీటిని అప్పణంగా కిందకు వదులుతూ రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని అన్నారు. 

పరీక్షల ఫలితాలుఏ సీఎం కూడా ఇంట్లో రిలీజ్​ చేయలె

77 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ పోటీ పరీక్షల ఫలితాలను.. ఏ సీఎం కూడా తమ ఇంటి నుంచి విడుదల చేయలేదని హరీశ్​రావు విమర్శించారు. కానీ, సీఎం రేవంత్​రెడ్డి మాత్రం తన ఇంటి నుంచి ఎప్​సెట్​ ఫలితాలను విడుదల చేశారని, ఇది తన అహంభావానికి నిదర్శనమని అన్నారు. రేవంత్​కు పాలన మీద, విద్యార్థుల మీద చులకనభావం ఉన్నట్టు తేలిందన్నారు. సెక్రటేరియెట్​ మొహం చూడడం లేదని, ఇటు అధికారులను, అటు పోలీసులను తమ పనిని చేసుకోనివ్వడం లేదని విమర్శించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని హరీశ్ ప్రశ్నించారు.