- వచ్చే ఏడాది నుంచి ఓయూలో క్లాస్లు: బుర్రా వెంకటేశం
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో, హాస్టళ్లలోని విద్యార్థులకు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయం హార్వర్డ్ పాఠాలు బోధించనుంది. బీసీ సంక్షేమ శాఖ, ఉస్మానియా యునివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశంను హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డొమినిక్ మావో శనివారం కలిశారు. తమ ప్రతిపాదనను తెలియజేశారు. ముందుగా బీసీ విద్యార్థుల్లో ప్రతిభ ఆధారంగా వంద మందిని గుర్తించి వారికి పది రోజులు క్లాస్ లు నిర్వహిస్తామని డొమినిక్ మావో తెలిపారు. ఉన్నత విద్య కోసం హార్వర్డ్ యూనివర్సిటీలో చేరడానికి ఈ తరగతులు ఉపయోగపడతాయని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాఠాలు చెప్తారని వివరించారు. శిక్షణతో ఉన్నతవిద్యను అభ్యసించి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం కల్పిస్తామన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి హార్వర్డ్ యూనివర్సిటీ ముందుకు రావడం అభినందనీయమని బుర్రా వెంకటేశం అన్నారు. హార్వర్డ్ వర్సిటీ ప్రతిపాదనను ప్రభుత్వానికి తెలిపి నిర్ణయాన్ని త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా మావోకు తాను రచించిన అమెజాన్ బెస్ట్ సెల్లర్ “సెల్ఫీ ఆఫ్ సక్సెస్” పుస్తకాన్ని బుర్రా వెంకటేశం బహుకరించారు.