హైదరాబాద్,వెలుగు: ఏటీఎం మెషీన్లలో టెక్నికల్ ఎర్రర్ క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్ ఫెయిలైందని బ్యాంకుల నుంచి క్యాష్ రీ ఫండ్ పేరుతో మోసాలు చేస్తున్న హర్యానా గ్యాంగ్కు చెందిన ఐదుగురిని చార్మినార్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 ఏటీఎం కార్డులు, 2 బైక్ లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సౌత్జోన్ డీసీపీ గజరావ్ భూపాల్తో కలిసి సీపీ అంజనీకుమార్ మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. హర్యానాలోని పల్వాల్ జిల్లా నటోలి గ్రామానికి చెందిన మహ్మద్ ఇష్రాద్ అహ్మద్, అసీం ఖాన్,రిజ్వాన్ ఖాన్,ముస్తక్ ఖాన్,ఆసిఫ్ ఐదుగురు గ్యాంగ్గా ఏర్పడి ఏటీఎం సెంటర్లలో క్యాష్ ను కొట్టేస్తున్నారు. మెట్రో సిటీస్లోని ఏటీఎం సెంటర్స్ను ఈ గ్యాంగ్ టార్గెట్ చేసింది. తమ గ్రామానికే చెందిన ముబీన్ అహ్మద్,అబిత్, జాబిద్తో కలిసి మహ్మద్ ఇష్రాద్ గ్యాంగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో సిటీకి చేరుకుంది. 8 మంది గ్యాంగ్ సభ్యులు ఆటోలను రెంట్కు తీసుకుని సిటీలోని ఏటీఎం సెంటర్లు వద్ద రెక్కీ నిర్వహించేవారు.
సెక్యూరిటీ లేని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేసి లోపలికి వెళ్లి తమ దగ్గరున్న డెబిట్ కార్డును స్వైప్ చేసేవారు. రూ.10 వేల నుంచి 25 వేల వరకు అమౌంట్ ఎంటర్ చేసేవారు. క్యాష్ బయటకు వచ్చే టైమ్లో టెల్లర్ మెషీన్ పవర్ సప్లయ్ను ఆఫ్ చేసేవారు. క్యాష్ లోపలికి వెళ్ళకుండా పట్టుకునేవారు. పవర్ ఆఫ్ చేయడంతో మెషీన్ లో టెక్నికల్ ఎర్రర్ కారణంగా ట్రాన్సాక్షన్లో ఫెయిలైందంటూ రిసీట్ వచ్చేది. ఆ తర్వాత ఎస్బీఐ టోల్ఫ్రీ నంబర్కి కాల్ చేసి అమౌంట్ విత్డ్రా కాలేదని కంప్లయింట్ చేసేవారు. దీంతో సంబంధిత బ్యాంక్ నాలుగు రోజుల్లో క్యాష్ ను రీఫండ్ చేసేది. ఇలా ఈ గ్యాంగ్ 3 కమిషనరేట్ల పరిధిలో 42 ఏటీఎం సెంటర్ల నుంచి రూ. 5 లక్షల క్యాష్ ను విత్డ్రా చేసింది.
రెండేండ్లుగా వరుస చోరీలు
మెట్రో సిటీస్లో ఈ గ్యాంగ్ రెండేండ్లుగా వరుస చోరీలు చేస్తోంది. ఆగస్ట్,సెప్టెంబర్లో ఓల్డ్ సిటీలోని హుస్సేని ఆలం ఎస్బీఐ ఏటీఎం సెంటర్ లో మెషీన్ లో ఎర్రర్ క్రియేట్ చేసి రూ.53 వేలు విత్డ్రా చేశారు. క్యాష్ రాలేదని కంప్లయింట్ చేశారు. 2 నెలల్లో 6 ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్ కావడంతో ఎస్బీఐ టెక్నికల్ వింగ్ అలర్ట్ అయ్యింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా జరిగినట్లు గుర్తించి హుస్సేని ఆలం పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఆటోలను ట్రేస్ చేశారు. ఇష్రాద్ అహ్మద్, అసీం ,రిజ్వాన్, ముస్తక్ ఆసిఫ్ను అరెస్ట్ చేశారు. ముబీన్,అబిడ్,జబిద్ కోసం గాలిస్తున్నారు.