సాయన్న కుటుంబ సభ్యులకు బండారు దత్తాత్రేయ పరామర్శ

సాయన్న కుటుంబ సభ్యులకు బండారు దత్తాత్రేయ పరామర్శ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్న కుటుంబ సభ్యులను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన దత్తాత్రేయ సాయన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సేవలందించిన సాయన్న ఆకస్మిక మరణం కంటోన్మెంట్ ప్రజలకు  తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సాయన్న కుటుంబ సభ్యులను ఓదార్చి.. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి..ధైర్యం చెప్పారు. సాయన్నలాంటి మృదుస్వభావిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. 

నిన్న అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిర్వహించకపోవడంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ తీరును శ్మశానవాటిక వద్ద ఎండగట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిని నిలదీశారు. దీంతో మంత్రులు సమాధానం చెప్పలేక వెనక్కి వెళ్లిపోయారు. చివరకు అభిమానులకు సాయన్న కుటుంబసభ్యులు నచ్చజెప్పి అంత్యక్రియలు నిర్వహించారు.