
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో హాష్ ఆయి ల్, గంజాయి దందా ఆగడం లేదు. లోకల్గా అమ్ము తూ, జిల్లా మీదుగా భారీ మొత్తంలో తరలిస్తూ వరుసగా పట్టుపడుతున్నా వ్యాపారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఆంధ్ర, -ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి జిల్లా మీదుగా వెళ్లే విజయవాడ, వరంగల్ హైవేల మీదుగా యథేచ్ఛగా హైదరాబాద్, మహారాష్ట్రకు రవాణా చేస్తున్నారు. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాతోపాటు తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారు.
భారీ ఆఫర్లు..!
గంజాయి రవాణా చేయడానికి పెద్ద మొత్తంలో ఆఫర్ చేయడంతో వెహికల్స్యజమానులు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి హైదరాబాద్, మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు గంజాయి తరలించడానికి కిలో రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకూ చెల్లిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ లెక్కన క్వింటాల్కు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల ఆదాయం వస్తుండటంతో వెహికల్స్ యజమానులు కేసులు అవుతాయని తెలిసినా ముందుకు వస్తున్నట్టు సమాచారం.
రూట్ మారుస్తున్రు..
ఇటీవల పోలీసుల నిఘా పెరగడంతో వ్యాపారులు కొత్త మార్గాల గుండా రవాణా చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, తిర్మలగిరి యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, వలిగొండ, ఆలేరు, భువనగిరి నుంచి హైదరాబాద్ వైపునకు ఇటీవల రవాణా జరుగుతోందని తెలుస్తోంది. తరలించేందుకు వెహికల్స్ కింద అరలు ఏర్పాటు చేయడం, కొబ్బరి బొండాల మధ్యలో గంజాయి బస్తాలను తరలించడం లాంటి ట్రిక్స్ వాడుతున్నారు.
రవాణాకు సులువుగా హాష్ ఆయిల్..
తరలించేందుకు సులువుగా ఉంటుందన్న కారణంతో వ్యాపారులు గంజాయి నుంచి తీసిన హాష్ఆయిల్ రవాణాపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. 50 కిలోల గంజాయికి రూ. 75 వేల నుంచి రూ. లక్ష వరకూ ఉంటుంది. అయితే 50 కిలోల గంజాయి నుంచి లీటర్ హాష్ ఆయిల్ మాత్రమే లభిస్తుంది. దీని ఖరీదు లీటర్కు రూ. 2 లక్షలు ఉంటుంది. రూ. లక్ష వరకూ లాభం ఉండడం, లీటర్ బాటిల్ను చిన్న బ్యాగులో వేసుకొని ఈజీగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వ్యాపారులు ఈ తరహా వ్యాపారంపై ఫోకస్ పెడుతున్నారు. గతంలో రామన్నపేట బస్టాండ్లో రెండు లీటర్ల హాష్ ఆయిల్తో ఓ వ్యక్తి పట్టబడిన విషయం తెలిసిందే.
యువతే టార్గెట్..
నగర శివారు ప్రాంతాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. యాదాద్రి జిల్లా హైదరాబాద్కు దగ్గరలో ఉండటంతో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, తదితర వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ను ఎంచుకొని గంజాయి, హాష్ ఆయిల్ను విక్రయిస్తున్నారు. గంజాయిని చిన్న పొట్లాలుగా మార్చి విక్రయిస్తున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు చదువును పక్కనపెట్టి గంజాయికి బానిసలవుతూ బతుకులు ఆగం చేసుకుంటున్నారు.
కొన్ని ఘటనలు పరిశీలిస్తే..
గతేడాది ఆగస్టు 8న హైదరాబాద్కు చెందిన సందీప్ ఏపీలోని అరకు నుంచి హైదరాబాద్ కు రెండు లీటర్ల హాష్ ఆయిల్ తీసుకెళ్తుండగా యాదాద్రి జిల్లా రామన్నపేట బస్టాండ్లో పోలీసులకు పట్టుబడ్డాడు. గతేడాది అక్టోబర్ 3న జాతీయ రహదారి 163పై యాదాద్రి జిల్లా ఆలేరు శివారులోకి ఓ డీసీఎంలో 900 కిలోలు క్వింటాళ్ల గంజాయి పెట్టి పైన కొబ్బరికాయలతో కవర్ చేసి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 4న వలిగొండ క్రాస్రోడ్డు వద్ద డీసీఎం పై ఇనుప రేకు మధ్యలో పేర్చిన 400 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని ఎనిమిది గంటల్లోనే అమ్మకం, రవాణాలో భాగస్వాములుగా ఉన్న వారందరినీ అరెస్ట్ చేశారు. ఇటీవల మోత్కూరులోని ఓ వ్యక్తి గంజాయిని చిన్న పొట్లాలుగా మార్చి ఒక్కోటి రూ. 300 నుంచి 400 చొప్పున విక్రయిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 25 చిన్న ప్యాకెట్లలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీంతో జరిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో వ్యాపారులు దొడ్డిదారుల్లో రవాణా చేస్తున్నారు. వారి ఇన్ఫర్మేషన్ స్థానికులకు తెలిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలి.
- రాజేశ్చంద్ర, డీసీపీ, యాదాద్రి జోన్