పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతన్నం.. ఎవ్వరు పట్టించుకుంట లేరు

పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతన్నం.. ఎవ్వరు పట్టించుకుంట లేరు
  • బాధితులతో రైతు స్వరాజ్య వేదిక
  • 21 సంఘాల పబ్లిక్ హియరింగ్ 
  • మంత్రిని, సీఎస్​ను కలుస్తామన్న జ్యూరీ సభ్యులు
  • స్పందించకుంటే హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ‘‘మూడు నాలుగేండ్లుగా అప్లికేషన్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతన్నం. కనపడ్డ ఆఫీసర్​ను అడుగుతున్నం. ఎవ్వరు పట్టించుకుంట లేరు. పెన్షన్​రాకపోతే ఎట్ల బతకాలె సారూ”అంటూ పలువురు ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి.. ఇబ్బంది పడుతున్నా సర్కారు కనీసం పెన్షన్​ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో రైతు స్వరాజ్య వేదిక, మరో 20 సంఘాల ఆధ్వర్యంలో పెన్షన్ దరఖాస్తుదారులతో పబ్లిక్ హియరింగ్, ధర్నా చేపట్టారు. తమ బాధలు చెప్పుకునేందుకు రాష్ర్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది దరఖాస్తుదారులు తరలివచ్చారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ గోపాల్ రావు,  మానవ హక్కుల వేదిక జాతీయ కన్వీనర్ జీవన్ కుమార్, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్, జర్నలిస్ట్ పద్మజా షా, మహిళ హక్కుల కార్యకర్త గిరిజ జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. ఆసరా దరఖాస్తుదారులు జ్యూరీ సభ్యుల మందు వారి గోడు  వెల్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పెన్షన్ల కోసం ఎన్నో సార్లు అప్లికేషన్లు పెట్టామని, అధికారుల చుట్టూ తిరుగుతున్నా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ ఎప్పుడు వస్తదని అడిగితే కేసీఆర్, కేటీఆర్ ను అడగండని అధికారులు సమాధానాలు చెబుతున్నారని వాపోయారు.
ఎన్నికల హామీ నెరవేర్చలే..
ఎన్నికల ముందు పెన్షన్​వయోపరిమితి తగ్గిస్తామని ప్రకటిస్తే.. అధికార పార్టీకి ప్రజలు ఓట్లు వేశారని ఇంత వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని రైతు స్వరాజ్య వేదిక నేతలు కొండల్ రెడ్డి, కన్నెగంటి రవి అన్నారు. ఇతర ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం దగ్గర పేద కుటుంబాలను ఆదుకునేందుకు నిధులు లేవా అని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్లపై ‘వెలుగు’లో సోమవారం పబ్లిష్ అయిన “ఉన్నయి తీసేస్తున్నరు.. కొత్తయి ఇస్తలే ”స్టోరీని రైతు స్వరాజ్య వేదిక నిర్వాహకులు సమావేశంలో ప్రదర్శించారు.
ప్రభుత్వం స్పందించాలి: రిటైర్డ్ ఐఏఎస్ గోపాల్ రావు
పెన్షన్ల కోసం ఏండ్ల తరబడి తిరుగుతున్నా.. అర్హులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జ్యూరీ మెంబర్ గోపాల్ రావు మండిపడ్డారు. పెన్షన్లు ఇచ్చే బాధ్యత సర్కారుపై ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో 48 లక్షల మంది పెన్షన్ తీసుకుంటే అది ఇప్పుడు 36 లక్షలకు తగ్గిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో 11లక్షల మంది పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్నికలు వస్తే తప్ప ప్రజల సమస్యలు పట్టవా అని ఆయన ప్రశ్నించారు. 
అస్తవ్యస్త పాలన: జీవన్ కుమార్ 
తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, సమస్యలపై అధికారులను అడిగితే కేసీఆర్ ను అడుగు అంటున్నారని జీవన్ కుమార్ ఆరోపించారు.  అర్హుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కరించకుంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి బాధ్యత లేదని, అధికారులు, పాలకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మూడు నాలుగు రోజుల్లో సీఎస్​తోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలుస్తామని జీవన్ కుమార్ తెలిపారు. 
మూడు నాలుగేండ్లుగా అప్లికేషన్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని, అయినా పెన్షన్లు ఇవ్వడం లేదని ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు కన్నీటి పర్యంతమయ్యారు. పెన్షన్​రాకపోతే ఎట్ల బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో రైతు స్వరాజ్య వేదిక, మరో 20 సంఘాల ఆధ్వర్యంలో పెన్షన్ దరఖాస్తుదారులతో పబ్లిక్ హియరింగ్, ధర్నా చేపట్టారు. తమ బాధలు చెప్పుకునేందుకు రాష్ర్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది దరఖాస్తుదారులు తరలివచ్చారు.
పెన్షన్​ ఇస్తలేరు..
నా భర్త రెండేండ్ల కింద 5 బోర్లు వేసిండు. అయినా నీళ్లు పడలేదు. రూ.10 లక్షల వరకు అప్పు అయింది. అప్పు ఎట్ల కట్టాలని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆయన వయసు 55 ఏండ్లే అయినా.. ఆధార్ కార్డులో 62 ఏండ్లని పడ్డది. రైతు బీమా పైసలు కూడా రాలేదు. వితంతువు పెన్షన్​వస్తదని ఎన్నిసార్లు అప్లికేషన్​ పెట్టుకున్నా.. ఇస్తలేరు. - లక్ష్మి, జనగాం జిల్లా
నాలుగుసార్లు అప్లికేషన్..
నా భర్త మూడేండ్ల కింద చనిపోయాడు. వితంతువు పెన్షన్ కోసం నాలుగు సార్లు అప్లికేషన్లు పెట్టుకున్న. ఇప్పటి వరకు మంజూరు కాలేదు. ఇద్దరు పిల్లలతో పాటు మామను పోషించడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న. ప్రభుత్వం స్పందించి పెన్షన్​ ఇప్పిస్తే కొంత బాధ తీరుతుంది. - సరిత, కట్టంగూర్, నల్గొండ జిల్లా