కర్ణాటక నుంచి రాజ్యసభకు మాజీ ప్రధాని ,జేడీఎస్ అధ్యక్షులు HD దేవేగౌడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు బీజేపీకి చెందిన ఈరన్న కదాడి, అశోక్ గస్తీలు …ఎలాంటి పోటీ లేకుండా రాజ్యసభకు ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక ఈ నెల 19న జరగాల్సి ఉండగా…నాలుగు స్థానాలకు నలుగురే అభ్యర్థులు బరిలో ఉండడంతో ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు.
కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ తో కలిసి బీజేపీ సంఖ్యాబలం 117 ఉండగా…కాంగ్రెస్ కు 68, జేడీఎస్ కు 34 మంది సభ్యులున్నారు. ఒక్కో రాజ్యసభ సీటు గెలవాలంటే 45 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా..జేడీఎస్ కు అవకాశం లేనప్పటికీ కాంగ్రెస్ మద్దతుతో ఓ సీటును గెలుచుకుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే రాజ్యసభకు వెళ్లడం ఇదే మొదటిసారి కాగా..దేవేగౌడ రెండో సారి రాజ్యసభకు వెళ్తున్నారు. 1996లో ప్రధానిగా ఉన్న సమయంలో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు దేవేగౌడ.