మనదేశంలో ఫిన్​టెక్ వాడకం బేష్​

మనదేశంలో ఫిన్​టెక్ వాడకం బేష్​

న్యూఢిల్లీ :  ఫైనాన్షియల్​ టెక్నాలజీల (ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్) వాడకం ఇతర దేశాల కంటే మన దగ్గరే ఎక్కువగా ఉందని కేంద్ర ఆంట్రప్రెనార్​, స్కిల్​ డెవెలప్​మెంట్​, ఎలక్ట్రానిక్స్ & టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ముంబైలో మంగళవారం జరిగిన మనీకంట్రోల్ ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ కాన్​క్లేవ్​(ఐఎఫ్​సీ)లో మాట్లాడుతూ భారతదేశంలోని ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ ఎకోసిస్టమ్, దాని భవిష్యత్తు, అవకాశాల గురించి వివరించారు. త్వరలో రాబోతున్న డేటా ప్రొటెక్షన్​చట్టం ఫిన్​టెక్​ బిజినెస్​లకు అడ్డంకులు సృష్టించబోదని  స్పష్టం చేశారు. ఇండియాలో 87 శాతం జనాభా ఫిన్​టెక్ ​సేవలను ఉపయోగించుకుంటున్నారని,  ప్రపంచ సగటు 67 శాతం మాత్రమేనని అన్నారు.  ‘‘ఇండియా ఫిన్​టెక్​ సిస్టమ్​ మిగతా దేశాలతో పోలిస్తే అత్యంత వేగంగా ఎదుగుతోంది.

మన ఇన్నోవేషన్లకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.  2025-–26 నాటికి ఇండియా ఎకానమీ ట్రిలియన్ డాలర్ల  టార్గెట్​ను చేరుకోవడంలో ఫిన్​టెక్ ​రంగం కీలకం. భారతీయ యువతలో అద్భుతమైన సత్తా ఉంది. దానిని వాడుకోవాలి.  మొత్తం ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ ఎకానమీ వాటా 2026 నాటికి 22 శాతానికి పెరుగుతుంది”అని ఆయన వివరించారు. ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌లో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ గురించి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌లో ఏఐ వాడకం కచ్చితంగా పెరుగుతుందని, ఇంటర్నెట్ ఎకోసిస్టమ్​లోని ఇతర భాగాలకూ మేలు చేస్తుందని రాజీవ్​ చంద్రశేఖర్​ వివరించారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఇండియా ఏఐ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభిస్తామని తెలిపారు.

ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌ల కోసం ప్రత్యేక కమిటీ: ఆర్​బీఐ 

ఫైనాన్షియల్​ టెక్నాలజీ (ఫిన్​టెక్​) సంస్థలను నియంత్రించడానికి  ఆర్​బీఐ  ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి వెల్లడించారు. ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌లలో ఇనోవేషన్లను తీసుకురావడం, కంట్రోల్​ చేయడం ఎప్పుడూ ఒక సవాలేనని అన్నారు. "ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌లు,  పెద్ద టెక్‌‌‌‌‌‌‌‌ల ద్వారా వచ్చే నష్టాలపై రెగ్యులేటర్లు నిఘా ఉంచాలి. ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు,  పెద్ద టెక్‌‌‌‌‌‌‌‌ల వల్ల వచ్చే ప్రమాదాలు వేర్వేరుగా ఉంటాయి.  ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్స్ లెండింగ్ ఎకోసిస్టమ్ కోసం మేం ఒక ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్ ను తీసుకొస్తున్నాం. ఈ విధానంలో అయినా కస్టమర్​ భద్రత మాకు చాలా ముఖ్యం. అయితే డేటా సెక్యూరిటీ, బ్రీచెస్​ విషయంలో ఫిన్​టెక్​లు చాలా జాగ్రత్తగా ఉండాలి”అని చౌదరి చెప్పారు.

డిజిటల్​ రూపాయి గురించి మాట్లాడుతూ ప్రైవేట్​ సెక్టార్​కు మరిన్ని యూజ్​ కేస్​లు దొరికితే దీని వాడకం ఇంకా పెరుగుతుందని వివరించారు. సెంట్రల్​ బ్యాంక్​ డిజిటల్​కరెన్సీ (సీబీడీసీ)లో చేరాల్సిందిగా ప్రైవేట్​సెక్టార్​ను ఎంకరేజ్​ చేస్తున్నామని చౌదరి ఈ సందర్భంగా వివరించారు. ఇదిలా ఉంటే యూపీఐ వల్ల ఫిన్​టెక్​ సంస్థలకు ఎంతో మేలు జరుగుతోందని ఈ సందర్భంగా  ఎన్​సీఐ సీఈఓ దిలీప్​ అస్బే  అన్నారు. యూపీఐ పూర్తి సత్తా ఇంకా బయటపడలేదని, ఇప్పుడున్న వాటితో పోలిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్యను పది రెట్లు పెంచవచ్చని చెప్పారు.