- రిజిస్టర్లు సక్రమంగా మెయింటెయిన్ చేయాలె
- బియ్యం నిల్వల్లో తేడాలొస్తే.. హెడ్మాస్టర్లదే బాధ్యత
- స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ విజయ్కుమార్
హైదరాబాద్, వెలుగు: బడుల్లో హెడ్మాస్టర్ లేదా టీచర్ గానీ రుచి చూసిన తర్వాతనే మధ్యాహ్న భోజనాన్ని స్టూడెంట్స్ కు పెట్టాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయ్కుమార్ ఆదేశించారు. ప్రతిరోజూ వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే స్టూడెంట్స్కు అందించాలని డీఈఓలు, ఎంఈఓలకు సూచించారు. సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో మిడ్డే మీల్స్ అమలుపై మార్గదర్శకాలను ఆయన జారీచేశారు. రాష్ట్రంలోని 27,406 స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోందనీ, 22,73,043 మంది స్టూడెంట్స్కు ఈ భోజనం అందుతోందని చెప్పారు. విద్యార్థులకు వారంలో మూడు గుడ్లను అందించాలనీ, భోజనం, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతినెలా పదో తేదీలోపే మిడ్డే మీల్స్ ఏజెన్సీలకు గౌరవ వేతనం, ఇతర మొత్తాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సివిల్ సప్లై, ఇతర అధికారులు తనిఖీ చేసినప్పుడు రిజిస్టర్స్లో బియ్యం నిల్వ, బడిలోని నిల్వలకు తేడా ఉంటే హెడ్మాస్టర్లదే బాధ్యతని హెచ్చరించారు. మిడ్డే మీల్స్ నిర్వహణకు 4 రిజిస్టర్లు మెయింటెయిన్ చేయాలని ఆదేశించారు. హెడ్మాస్టర్లు బడుల్లోనే కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.