
- రేషన్ కార్డు ఆధారంగా భూమి కేటాయింపు
కాగజ్ నగర్, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఎటువంటి కష్టం వచ్చినా పరిష్కరిస్తామని, చింతల మానేపల్లి మండలం దిందా, బండేపల్లి గ్రామాల్లో నెలకొన్న పోడు భూముల రీ ట్రైవ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. శుక్రవారం కౌటాల, చింతల మానేపల్లి మండలాల్లో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. బాలాజీ అనుకోడ రైతు వేదికలో ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ.. ఇప్పటికే దిందా పోడు రైతుల ఇబ్బందులపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో మాట్లాడామని, రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబానికి నాలుగు నుంచి ఐదెకరాలు ఇచ్చేలా ఫారెస్ట్ ఆఫీసర్లు ఒప్పుకున్నట్లు చెప్పారు.
దిందా బ్రిడ్జి నిర్మాణం గత ప్రభుత్వ హయంలో పలు కారణాలతో ఆలస్యమైందని, బ్రిడ్జి నిర్మాణంపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టామని, నిర్మాణానికి అనుమతి వచ్చిందని, దసరా నుంచి పనులు మొదలు కానున్నాయని పేర్కొన్నారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొమురం మాంతయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్య, కాగజ్ నగర్ వ్యవసాయ శాఖ ఏడీఏ మనోహర్, డీసీఎస్ ఓ సాదిక్, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, మడావి దౌలత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం
దహెగాం, వెలుగు: కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం అని ఎమ్మెల్సీ విఠల్ అన్నారు. అడిషనల్ కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలసి దహెగాం మండల కేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తోందని పేర్కొన్నారు. మండలంలో 240 కొత్త రేషన్ కార్డులు, 807 కార్డుల్లో సభ్యుల పేర్లను యాడ్ చేసినట్టు పేర్కొన్నారు. రేషన్ కార్డుల నమోదు నిరంతర ప్రక్రియని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు వస్తాయని పేర్కొన్నారు. రేషన్డీలర్లు అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తామని, లబ్ధిదారులు బియ్యం అమ్ముకుంటే రేషన్కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ మునావర్ షరీఫ్, ఎంపీడీవో ఆల్బర్ట్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.