సింగరేణి లాభాలు ప్రకటించాలె .. బొగ్గు గనులపై కార్మికుల ఆందోళనలు

సింగరేణి లాభాలు ప్రకటించాలె .. బొగ్గు గనులపై కార్మికుల ఆందోళనలు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఆర్జించిన లాభాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ ​చేస్తూ శుక్రవారం మందమర్రి ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై కార్మికులు ఆందోళన చేపట్టారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, వైస్​ ప్రెసిడెంట్ సుదర్శనం ఆధ్వర్యంలో ఆయా గనులు, డిపార్ట్​మెంట్ల వద్ద కార్మికులు, యూనియన్ ​శ్రేణులు సింగరేణి యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ ధర్నాలకు దిగారు. లీడర్లు మాట్లాడుతూ.. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు గడుస్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఈ ఏడాది ఆర్జించిన లాభాలను ప్రకటించలేదన్నారు. లాభాలను ప్రకటించిన తర్వాతే కార్మికులకు పంపిణి చేసే వాటాను తేల్చాల్సి ఉంటుందని, అయినా ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. 

కార్మికులకు క్వాలిటీ షూలు అందించాలని, సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, మెడికల్​రీయింబర్స్​మెంట్​ చెల్లించాలని డిమాండ్​చేశారు.  రిటైర్డ్ కార్మికులకు సీపీఆర్​ఎంఎస్​ద్వారా అందించే ఆసుపత్రి ట్రీట్​మెంట్​ ఛార్జీలు వసూలు చేయవద్దని కోరారు. రిటైర్మెంట్​బెని ఫిట్స్ వెంటనే సెటిల్ చేయాలని, మందమర్రి లోని గనులు, డిపార్ట్​మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఆయా గనులు, డిపార్ట్​మెంట్ల సింగరేణి ఉన్నతాధికారులకు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ ​జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, పిట్​ సెక్రట రీలు గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, పారిపల్లి రాజేశం, కలవేల శ్రీనివాస్, కె. ఓదెలు, సృజన గీతిక తదితరులు పాల్గొన్నారు.