
న్యూఢిల్లీ: తయారీ రంగం పనితీరు ఈ ఏడాది మే నెలలో కొద్దిగా నెమ్మదించింది. అయినప్పటికీ విస్తరణ బాటలోనే ఉందని హెచ్ఎస్బీసీ గ్లోబల్ పేర్కొంది. ఇండియన్ కంపెనీల గ్లోబల్ అమ్మకాలు గత 13 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయని తెలిపింది. హెచ్ఎస్బీసీ విడుదల చేసిన మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మే నెలకు గాను 57.5 గా రికార్డయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇది 58.8 గా ఉంది. ఈ ఏడాది మార్చిలో మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ ఇండెక్స్ 16 ఏళ్ల గరిష్టమైన 59.1 కి చేరుకున్న విషయం తెలిసిందే. పీఎంఐ 50 కి పైన రికార్డయితే సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు. కొత్త ఆర్డర్లు, ప్రొడక్షన్ తగ్గడంతో కిందటి నెలలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ పనితీరు నెమ్మదించిందని హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఎకనామిస్ట్ మైత్రేయి దాస్ అన్నారు. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం, హీట్వేవ్స్ కారణంగా వర్కింగ్ అవర్స్ తగ్గాయని చెప్పారు.