ములుగు జిల్లా మేడారం, ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర పరిసరాలు శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి. మేడారం మహాజాతర మరో ఐదు రోజులే ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవార్లకు చీర, సారె, ఎత్తు బంగారం సమర్పించి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
శుక్రవారం ఒక్కరోజే లక్షకు పైగా భక్తులు వచ్చినట్లు ఈవో తెలిపారు. మరో వైపు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతరకు సైతం శుక్రవారం భక్తులు పోటెత్తారు. తెలంగాణ, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. మెస్రం వంశీయులు భేతాల్ పూజలు చేసి జాతరను అధికారికంగా ముగించారు. మెస్రం వంశీయులు ఆదివారం తెల్లవారుజామున బుడుందేవ్ జాతను ప్రారంభించనున్నారు.
