కార్తీకమాసం రెండో సోమవారం ( నవంబర్3) శివాలయాలకు భక్తులు పోటెత్తారు. నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం,ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం కార్తీక మాసం రెండవ సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి ( నవంబర్ ఉదయం 10 గంటల సమయంలో ) 4 గంటల సమయం పడుతుంది.
భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు.. వ్రతాలు చేసుకున్నారు.
కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు ఆలయ అధికారులు పాలు ప్రసాదాలు అందచేస్తున్నారు. శని,అది,సోమవారాలలో స్పర్శ దర్శనం,సామూహిక, గర్భాలయా అభిషేకాలు కార్తీక మాసం నెలరోజులు ఆపేశారు. మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు మూడు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు .
►ALSO READ | కాశీబుగ్గలో తొక్కిసలాట.. 9 మంది మృతి.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘటన
ఈ రోజు ( నవంబర్ 3) కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. సాయంత్రం ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి దగ్గర దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు..
