- హెనన్ ప్రావిన్స్లో వరద బీభత్సం.. ఇప్పటివరకు 25 మంది మృతి
- జెంగ్జౌ సిటీ సహా మరో 12 నగరాల్లో కుండపోత
- జెంగ్జౌలో మూడ్రోజుల్లోనే 61 సెంటీమీటర్ల వాన
- సిటీలోని ఓ సబ్ వే రైల్లో ప్రయాణికుల భుజాల దాకా నీళ్లు
- వరద నీటికి పేలిన అల్యూమినియం ఉత్పత్తి ఫ్యాక్టరీ
- హెనన్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన వెదర్ డిపార్ట్మెంట్
బీజింగ్: చైనాలోని హెనన్ ప్రావిన్స్లో వరదలు ముంచెత్తాయి. గత వెయ్యేళ్లలో చూడని స్థాయిలో వానలు కురవడంతో ప్రావిన్స్లో భయంకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, ఫ్లై ఓవర్లపైకి చేరి బిక్కుబిక్కుమంటున్న ప్రజలు, అండర్ గ్రౌండ్ టన్నెళ్ల నుంచి జనాలను కాపాడుతున్న సీన్లు, రైళ్లలోని ప్రయాణికుల భుజాల వరకు నీళ్లొచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వరదల వల్ల ప్రావిన్స్లో ఇప్పటివరకు 25 మంది చనిపోయారు. సబ్ వే టన్నెల్ నుంచి ప్రయాణిస్తున్న రైలులోకి నీళ్లు వెళ్లడంతో 12 మంది మరణించారు. ఇద్దరు గోడ కూలి చనిపోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు.
4 రోజులుగా కుండపోత
సెంట్రల్ హెనన్ ప్రావిన్స్లో దాదాపు 10 కోట్ల జనాభా నివసిస్తున్నారు. వ్యాపారానికి, ఫ్యాక్టరీలకు హెనన్ ప్రావిన్స్ పెట్టిందిపేరు. చైనాలోని అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ గత శనివారం నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఐఫోన్ సిటీగా పిలిచే జెంగ్జౌలో మంగళవారం 45 సెంటీమీటర్ల వాన కురిసింది. ఇక్కడ గత మూడ్రోజుల్లో 61 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సిటీలో ఇంత భారీ స్థాయిలో వానలు కురవడం ఇదే తొలిసారని వెల్లడించారు. ప్రావిన్స్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని రోజులు భారీ వానలు కురవచ్చని హెచ్చరించింది. అధికారులు సుమారు లక్షా 60 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆన్లైన్లో సాయం కోరుతున్న జనం
భారీ వానలకు సెంట్రల్ హెనన్ ప్రావిన్స్లోని సబ్వేలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రావిన్స్ను ఆనుకుని ఉన్న ఎల్లో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలకు అనేక వెహికల్స్ కొట్టుకుపోయాయి. భారీ వరదలకు జెంగ్జౌ సిటీలోని అల్యూమినియం ఉత్పత్తి ఫ్యాక్టరీ పేలింది. ప్రావిన్స్లోని ల్యూయాంగ్ నగరంలో ఉన్న యిహెతన్ డ్యామ్ దాదాపు 20 మీటర్ల మేర దెబ్బతింది. ఆ డ్యామ్ ఎప్పుడైనా కూలిపోవచ్చని ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. హెనన్లోని 31 పెద్ద, చిన్న డ్యామ్లలో నీళ్లు వార్నింగ్ లెవల్స్ దాటిపోయాయి. ప్రపంచ ప్రసిద్ధ షావోలిన్ టెంపుల్ను మూసేశారు. ‘ఈ’ నది పొంగుతుండటంతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతం లాంగ్మన్ గ్రుట్టూస్పైనా ప్రభావం పడొచ్చని చెప్పారు. హెనన్ ప్రజలు ఆన్లైన్లో సాయం కోసం అర్థిస్తున్నారు.
రైల్లో ఎంత మంది ఉన్నరో..
జెంగ్జౌలోని ఓ సబ్వే టన్నెల్ నుంచి వెళ్తున్న రైల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో అనేక మంది రైల్లో చిక్కుకుపోయారు. ప్రయాణికుల భుజాల వరకు నీరు ఉన్నట్టు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. రైల్లో కూడా ఇంతలా వరద నీరు చేరడం ఎన్నడూ చూడలేదని ప్రయాణికులు చెబుతున్నారు. రైల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది తాళ్ల సాయంతో కాపాడుతున్నారు. రైలులో ఎంతమంది చిక్కుకున్నారో తెలియాల్సి ఉంది. జెంగ్జౌ నగరం నుంచి లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 250కి పైగా విమానాల రాకపోకలను నిలిపివేశారు.