హైదరాబాద్: హైదరాబాద్లో ఉంటున్న ఏపీ ప్రజలు సంక్రాంతికి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్--విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. మంగళవారం (జనవరి 13) రాత్రి చిట్యాల దగ్గర విజయవాడ-హైదరాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వాహనాల రద్దీ పెరగడంతో పెద్ద కాపర్తి దగ్గర హైదరాబాద్ వచ్చే వాహనాలు ఆపి.. రెండు రూట్లలో విజయవాడ వైపు వెళ్లే వాహనాలను పంపించారు పోలీసులు. దీంతో హైదరాబాద్ రూట్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది.
మంత్రి కాన్వాయ్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతికష్టం మీద ట్రాఫిక్ క్లియర్ చేసి మంత్రి కాన్వాయ్కు రూట్ క్లియర్ చేశారు. మరోవైపు భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సరైన ఏర్పాట్లు చేయలేదని పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. రోడ్డు విస్తరణ పనులు వల్లే చిట్యాల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
