రాష్ట్రంలో కురుస్తున్న వానలతో ప్రాజెక్టులకు భారీ వరద

రాష్ట్రంలో కురుస్తున్న వానలతో ప్రాజెక్టులకు భారీ వరద

ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు.. రాష్ట్రంలో కురుస్తున్న వానలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి 3 లక్షల 85 వేల 530 క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండటంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు రిలీజ్ చేస్తున్నారు. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు ఎత్తి.. 4 లక్షల 43 వేల 293 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను  ప్రస్తుతం 884.6 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్  కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

మరోవైపు శ్రీశైలం నుంచి వరద వస్తుండటంతో సాగర్ 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 4 లక్షల 43 వేల 329 క్యూసెక్కుల వస్తుండగా.. ఔట్ ఫ్లో 4 లక్షలు 4 వేలు 137 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చిన నీటి వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో దాదాపు రెండు నెలలుగా కృష్ణా ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది.  

ఇక ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ప్రస్తుతం ఇన్ ఫ్లో 4 లక్షల 7 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. వచ్చిన నీటిని వచ్చేనట్లే దిగువకు వదులుతున్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు తగిన జాగ్రత్తలు చెప్తున్నారు. వాగులు, వంకలు, కాలువలు దాటొద్దని విపత్తు నిర్వహన సంస్థ హెచ్చరించింది.